1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 మే 2021 (15:21 IST)

టీవీ చూసేందుకు వచ్చిన బాలికపై అత్యాచారం.. కడుపు నొప్పి అంటే ఆరు నెలల గర్భిణీ?

మహిళలపై వయోబేధం లేకుండా అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. నిర్భయ లాంటి కఠినమైన చట్టాలొచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. టీవీ చూసేందుకు తన ఇంటికి వచ్చిన బాలికపై ఓ నీచుడు కన్నేశాడు. బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగుచూసింది. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. జగద్గిరిగుట్ట డివిజన్ కూనమహాలక్ష్మినగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పదమూడేళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన వ్యక్తిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కూనమహాలక్ష్మినగర్‌లో ఉండే వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు. పెద్దకూతురు మానసిక రుగ్మతతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటోంది. చిన్న కూతురు(13) 6వ తరగతి చదువుకుంటోంది. తల్లిదండ్రులు కూలి పనికి వెళ్తారు. కూతుళ్లు ఇంట్లోనే ఉంటారు. అదే బస్తీలో రాములు కుటుంబం నివాసముంటోంది.
 
చిన్న కూతురు టీవీ చూడటానికి రాము ఇంటికి వెళ్లేది. ఆ సమయంలో బాలికపై రాము కన్నేశాడు. ఓ రోజు టీవీ చూసేందుకు వచ్చిన బాలికను బెదిరించాడు. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే నీ తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. భయపడిన బాలిక ఈ దారుణాన్ని ఎవరికీ చెప్పలేదు. గత అక్టోబర్ లో ఈ ఘోరం జరిగింది.
 
అప్పటి నుంచి పలుమార్లు రాములు అఘాయిత్యం చేశాడు. కాగా, మే 24న మధ్యాహ్నం బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆరు నెలల గర్భిణి అని తెలిసింది. దీంతో తల్లిదండ్రులు షాక్ తిన్నారు. బాలికను నిలదీయగా జరిగిన విషయం తెలిపింది. 
 
బాలిక తల్లిదండ్రులు మే 25న జగద్గిరిగుట్ట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే సెక్టార్‌ ఎస్ఐ కేసు నమోదు చేయలేదని.. ఆపై మహిళా సంఘాల ఒత్తిడి కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రాములును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.