1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

నేడు హైదరాబాద్‌లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

flyover bridge
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ముఖ్యంగా, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 
 
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) ద్వి దశాబ్ద వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ భాగ్యనగరానికి వస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐటీ కారిడార్‌లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీటిని అమల్లో ఉంచుతారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. 
 
వాహనాల మళ్లించిన మార్గాలు... 
గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ వద్ద మలుపు తీసుకుని బొటానికల్ గార్డెన్, కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, మజీద్ బండ్ కమాన్, హెచ్‌సీయూ డిపో రోడ్డు మీదుకా వెళ్ళాల్సి ఉంటుంది. 
 
అలాగే, విప్రో జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్ పల్లి క్రాస్‌రోడ్డు, హెచ్‌సీయు వెనుక గోటు, నల్లగండ్ల మీదుగా పోవాల్సి ఉంటుంది. 
 
విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్ రామ్ గూడ రోటరీ, ఓఆర్ఆర్ రోడ్, ఎల్ అండ్ టి టవర్స్ మీదుగా ప్రయాణం చేయాలి. 
 
కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు జూబ్లీహిల్స్ రోడ్డు నం.45, మాదాపూర్ పీఎస్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి జంక్షన్ మీదుగా డైవర్ట్ చేశారు. 
 
ఇదిలావుంటే, ప్రధాని షెడ్యూల్ వివరాలను పీఎంవో వెల్లడించింది.
ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.25 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుటారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లులో 1.50 గంటలకు హెచ్.సి.యు క్యాంపస్‌కు వస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఐ.ఎస్.బికి  చేరుకుంటారు.
 
మధ్యాహ్నం 3.15 గంటల వరకు ఐఎస్బీ వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగింస్తారు. అలాగే మెరిట్ స్టూడెంట్స్‌కు ఆయన స్నాతకోత్సవ పట్టాలను అందజేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత బేగంపేటకు చేరుకుని 3.55 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నైకు చేరుకుంటారు.