గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (18:20 IST)

కేసీఆర్ గారూ మీరు ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి: తమ్మినేని వీరభద్రం

కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నిధులు, బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో ఉపేక్షించవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. కరీంనగర్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాలకు సిద్దంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
 
కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్ ఉద్యమిస్తే ఆయనకు తాము బాసటగా నిలుస్తామని తెలిపారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రానికి సమకూర్చాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం అప్పులు తీసుకోవాలని చెబుతుండటం దారుణమని ఆయన తెలిపారు.
 
జీఎస్టీ వల్ల రాష్ట్రం వేల కోట్లు నష్టపోయిందని ఆయన వివరించారు. ఎల్ఆర్ఎస్ నుండి సామాన్యులను మినహాయించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడంపై అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాలని తమ్మినేని పిలుపునిచ్చారు.