1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2019 (14:58 IST)

అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కి సర్వీస్ వ్యవహారం

సర్వీస్ వ్యవహారం ఒక అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతుంది. కొత్త జిల్లాలను రాష్ట్ర పతి ఉత్తర్వుల్లో చేర్చాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైల్‌ను కేంద్రం వెనక్కు పంపింది. కోర్టు తీర్పు తర్వాత చూద్దామని చెప్పింది. 
 
రాష్ట్ర పతి ఉత్తర్వుల్లో సవరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పంపిన ఫైల్‌ను కేంద్రం తిప్పి పంపింది. కొత్త జిల్లాలు, కొత్త జోన్ల ఏర్పాటు, ఉద్యోగాల క్యాడర్‌లలో మార్పులు చేస్తూ రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు గత ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులను మార్చి... కొత్త ఉత్తర్వులను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ క్రమంలో... గతంలోనే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
 
 అయితే ఆ ఉత్తర్వుల తర్వాత కొత్తగా మరో రెండు జిల్లాలు ఏర్పడ్డాయి. వాటిని కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాలని కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం దాన్ని వెనక్కి పంపించింది. కోర్టు కేసు ఉన్నందున... అది తేలే వరకు రాష్ట్ర పతి ఉత్తర్వులు అమలు చేయడం కుదరదని చెప్పింది.
 
 ఆర్టికల్ 371 కి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఉత్తర్వులున్నాయని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం కోర్టుకు వెళ్లడంతో కోర్ట్ స్టే విధించింది. ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధ్యం కాదని... జిల్లా పరిషత్తు ఉపాధ్యాయులను, ప్రభుత్యోపాధ్యాయులను ఒకే నిబంధన కిందకు తేవడం కుదరదని ప్రభుత్వ టీచర్లు కోర్టులో కేసు వేశారు.

అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పులు చేసి ఏకీకృత సర్వీస్ రూల్స్ ను అమలు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది.  కొత్తగా తయారు చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఆ మేరకు మార్పులు చేశారు. వీటిపై ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లడం తో కోర్టు స్టే విధించింది.

కేసు కొలిక్కి వస్తేనే కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని, ఆ తర్వాతే కొత్త జిల్లాలను చేర్చడం వీలవుతుందని తేల్చి చెప్పింది. ఆ తర్వాతే... వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపడం జరుగుతుందని తెలుస్తోంది.