శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: మంగళవారం, 18 ఆగస్టు 2020 (14:03 IST)

తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు, దురాక్రమణలను పట్టించుకోరా?

చెరువులు ఆక్రమణలకు గురౌతుంటే అధికారులు ఏం చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వీటి పరిరక్షణకు ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరించాలని, అదేవిధంగా గరిష్ట నీటిమట్టానికి సంబంధించిన అన్ని మ్యాపులు కోర్టులో సమర్పించాలని ఆదేశించింది.
 
జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని చెరువులన్నీ దురాక్రమణకు గురవుతున్నాయని, ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు చేపట్టకపోతే తెలంగాణ కూడా రాజస్థాన్ ఎడారిలా మారుతుందని హైకోర్టు హెచ్చరించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని చెరువులు దురాక్రమణకు గురవుతున్నా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. గతంలో ఆదేశించినా చెరువుల పరిరక్షణకు కమిటీలను ఎందుకు నియమించుకోలేదని నిలదీసింది. 
 
చెరువులు నీటిమట్టానికి సంబంధించిన అన్ని మ్యాపులను త్వరగా సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఖాజాగూడ చెరువు దురాక్రమణకు గురవుతుందంటూ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ లుబ్నా సౌహత్ రాసిన లేఖను హైకోర్టు సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎన్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం దీన్ని విచారించింది.
 
ఖాజాగూడ చెరువు ఎఫ్ టీల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే తగిన చర్యలు తీసుకోవాలని గతంలో కలెక్టర్‌ను ఆదేశించినా ఎందుకు చర్యలను చేపట్టలేదని ధర్మాసనం అడ్వకేట్ జనరల్ బీఎన్ ప్రసాద్‌ను ప్రశ్నించింది. ఆ అధికారి బదిలీ అయ్యారని ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించేందుకు కొంత గడువు కావాలని కోరారు. ఈ అంశాలపై పూర్తి వివరాలను సమర్చాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 8కి వాయిదా వేసింది.