1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (10:08 IST)

12 మంది బాలికలపై ట్యూటర్ అత్యాచారం... నల్గొండ కోర్టు సంచలన తీర్పు

నల్గొండ జిల్లాలోని ఓ వసతి గృహంలో ఉండే బాలికల్లో 12 మందిపై అత్యాచారం చేసిన కేసులో ఆ జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ జిల్లాలో గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు నిర్వహిస్తూ వచ్చిన ఈ వసతి గృహంలో ట్యూటర్‌గా చేసిన ఓ కామాంధుడు అత్యాచారం పర్వానికి తెరతీశాడు. ఈయనకు పలువురు సహకరించారు. దీంతో వీరందరికీ కోర్టు కఠిన శిక్షలు విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా తేలిన ట్యూటర్‌కు జీవితకారాగారశిక్ష విధించగా, ఆయనకు సహకరించిన  నిర్వాహకులు, నిర్వహకుడిని భార్యకు అర్నెల్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
ఈ కేసు తీర్పు వివరాలను పరిశీలిస్తే, ఏపీలోని గుంటూరు జిల్లా నగారానికి చెందిన నున్న శ్రీనివాసరావు, సరిత అనే దంపతులు విలేజ్ రీ కన్‌స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ (వీఆర్వో) అనే పేరుతో ఓ ప్రైవేట్ స్వచ్చంధ సంస్థను స్థాపించి, దానికి అనుబంధంగా బాలికల కోసం ఓ వసతి గృహాన్ని నడుపుతూ వచ్చారు. 
 
ఇందులో బాలికలకు చదువు చెప్పేందుకు రమావత్ హరీశ్ నాయక్‌ను ట్యూటర్‌గా నియమించారు. ఈ క్రమంలో హరీష్ రావత్ బాలికలకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఆ తర్వాత మూడు నెలల పాటు 12 మంది బాలికలపై అత్యాచారనికి తెగబడ్డాడు. ఈ విషయం బయటకు చెప్పినా, ఎదురుతిరిగినా అందర్నీ చంపేస్తానంటూ బాధితల బాలికలను బెదిరించాడు. 
 
ఈ కామాంధుడుకి నిర్వాహకులు శ్రీనివాసరావు, అతని భార్య సరిత కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు. అయితే, గత 2014 ఏప్రిల్ 3వ తేదీన ఓ బాధిత బాలిక తనపై జరిగిన దారుణాన్ని బహిర్గతం చేయడంతో ఈ వసతిగృహంలో జరిగిన వరుస అత్యాచారాలు వెలుగులోకి వచ్చాయి. 
 
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, మొత్తం 12 మంది బాలికలపై హరీష్ రావత్ అత్యాచారం చేసినట్టు తేలింది. దీంతో 12 కేసులు నమోదు చేసి, 12 చార్జిషీట్లను తయారు చేసి కోర్టుకు సమర్పించారు. వీటిపై విచారణ చేపట్టిన కోర్టు.. 12 కేసుల్లో 10 కేసుల్లో ప్రధాన నిందితుడు రావత్‌తో పాటు నిర్వాహకుడు శ్రీనివాసరావులను దోషులుగా తేల్చి, వారిద్దరికి జీవితఖైదుతో పాటు పదివేల రూపాయల అపరాధం విధించింది. 
 
అలాగే, నిర్వాహకుడి భార్య సరితకు ఆర్నెల్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా, బెదిరింపులకు పాల్పడినందుకు హరీష్ రావత్‌కు మరో రెండేళ్లు, అసభ్యంగా ప్రవర్తించినందుకు మరో మూడేళ్లపాటు జైలుశిక్ష విధిస్తూ నల్గొండ జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు న్యయమూర్తి నాగరాజు గురువారం సంచలన తీర్పునిచ్చారు.