ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (11:40 IST)

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనాలు వాపస్..!

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ  వాహనాలను ట్రాఫిక్ పోలీస్‌ శాఖ బుధవారం తిరిగి ఇచ్చేస్తున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వాహనాలను సీజ్‌ చేయవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజ్‌ చేసిన పలు వాహనాలు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ట్రాఫిక్ పోలీసు శాఖ తీరిగి ఇవ్వటాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించింది.

గుర్తింపు పత్రాలను చూపిస్తున్న సదరు వ్యక్తులకు పోలీసులు వాహనాలను ఇస్తున్నట్టు షాద్ నగర్ ట్రాఫిక్ సబ్ ఇన్స్ పెక్టర్ కె. రఘు కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సై రఘు కుమార్ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం తొమ్మిది పోలీస్ స్టేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇందులో షాద్ నగర్ (ఫరూక్ నగర్), కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, చౌదరిగుడా, నందిగామ పోలీసు స్టేషన్లతో పాటు తలకొండపల్లి, కడ్తాల్, ఆమన్ గల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు ఇంకా ఇతరత్రా కారణాల చేత పలు కేసులు నమోదైనట్లు ఎస్సై రఘుకుమార్ వివరించారు.

2018 నుండి 2021 వరకు తొమ్మిది పోలీస్ స్టేషన్లలో కలిపి మొత్తం 5208 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇందులో 2018లో 32  వాహనాలు సీజ్ అయ్యాయని అదేవిధంగా 2019లో 36, 2020లో 105, 2021లో 761  మొత్తం 932 వాహనాలు సీజ్ చేసినట్లు ఎస్సై వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు వీటిని సంబంధిత వాహన దారులకు తిరిగి చేస్తున్నట్లు ప్రకటించారు.

వాహన యజమానులు సదరు డాక్యుమెంట్లను ఆర్.సి, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డులతో పోలీస్ స్టేషన్లో పత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. డ్రంక్ డ్రైవ్ వాహనదారులు ఎవరైనా చనిపోతే సంబంధిత గ్రామ పంచాయతీ లేదా ఎఫ్ఐఆర్ లేదా మరణ ధ్రువీకరణ పత్రాలు పోలీస్ స్టేషన్లో అందజేసి వాహనాలు పొందవచ్చని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు,  కార్లు ఏవైనా సరే వాహనాలు తీసుకెళ్లవచ్చు అని ఆయన సూచించారు.