1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: సోమవారం, 25 జనవరి 2021 (18:15 IST)

తెలంగాణలో 70 ఏళ్లలో జరగనిది ఆరేళ్లలో జరుగుతోంది: హరీశ్ రావు

తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పైన విశ్వాసం‌ కోల్పోయారన్నారు మంత్రి హరీశ్ రావు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ‌అధికారంలో ‌లేదు... భవిష్యత్తులో రాదు‌. అందుకే ఆ పార్టీ కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు సీఎం కేసీఆర్ పైన విశ్వాసంతో తెరాసలో చేరుతున్నారు.
 
 తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం దేశానికి దిక్సూచిగా మారింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతీ గ్రామంలో డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీ, చెత్త సేకరణ వాహనాలు, ప్రకృతి వనాలు, ప్రతీ నెలా పల్లె ప్రగతి కింద నిధులను ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
 
70 ఏళ్లలో జరగని అభివృద్ధి తెరాస‌ ఆరేళ్ల పాలనలో జరుగుతోంది. పల్లెల్లో స్పష్టమైన మార్పు‌ కనిపిస్తుంది. పల్లెల్లో, పట్టణాల్లో గుణాత్మకమైన మార్పు తెచ్చింది తెరాస ప్రభుత్వం. ఈ మార్పులు చూసే కాంగ్రెస్, బీజేపీల నుంచి తెరాసలో చేరుతున్నారు. సదాశివపేటలో 32 కోట్లతో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి.
 
సంగారెడ్డి, సదాశివపేట పట్టణాలకు పట్టణ ప్రగతి కింద ప్రతీ నెలా నిధులను ప్రభుత్వం ఇస్తోంది.
రైతాంగానికి దేశంలో ఎక్కడా‌లేని విధంగా ఉచిత విద్యుత్ ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తోంది తెరాస ప్రభుత్వమే. సదాశివపేట బస్టాండ్  అభివృద్ధికి ఇటీవలే 20 లక్షలు విడుదల చేయడం జరిగింది. జిల్లా మంత్రిగా సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా అని అన్నారు మంత్రి హరీశ్ రావు.