మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (12:01 IST)

మహేష్ బాబు నోట 'సర్కారు వారి పాట'

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చివరగా నటించిన చిత్రం "సరిలేరు నీకెవ్వరు". గత సంక్రాంతికి విడుదలై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తే, రష్మిక మందన్నా హీరోయిన్. తమన్నా భాటియా ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ప్రకాష్ రాజ్ విలన్‌గా నటించగా, లేడీ అమితాబ్ విజయశాంతి ప్రత్యేక పాత్రలో ఆలరించింది. 
 
ఆ తర్వాత మహేష్ బాబు ఎలాంటి మూవీకి కమిట్ కాలేదు. కానీ, "గీత గోవిందం" చిత్ర దర్శకుడు పరశురామ్‌తో కలిసి ఓ ప్రాజెక్టును తీయనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో కూడా పరశురామ్ కూడా ఆ వార్తలను ధ్రువీకరించాడు. 
 
అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజైన మే 31వ తేదీన వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. అదేరోజు లాంఛనంగా సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తారని తొలుత  భావించారు. కానీ, కరోనా వైరస్ నేపథ్యంలో ఇది వీలుపడుతుందా లేదా అన్నది సందేహంగా మారింది. 
 
మరోవైపు, ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు 'సర్కారు వారి పాట' అనే టైటిల్ బాగుంటుందని అనుకుంటున్నారట. ఈ సినిమా పరశురామ్ స్టైల్లో పూర్తి ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందట. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడట. మిగిలిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.