శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2023 (15:40 IST)

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి నుంచి చక్కటి మెలోడీ పాట విడుదల

Naga Shaurya, Malvika Nair,
Naga Shaurya, Malvika Nair,
'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' వంటి మ్యాజికల్ ఫిలిమ్స్ తర్వాత శ్రీనివాస్ అవసరాల, నాగశౌర్య కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మాళవిక నాయర్ నాయిక. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని అంచనాలను రెట్టింపు చేసింది. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి 'కనుల చాటు మేఘమా' అంటూ సాగే మొదటి పాటను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
 
శ్రీనివాస్ అవసరాల చిత్రాలకు కళ్యాణి మాలిక్ స్వరపరిచే పాటలకు ప్రతేకత ఉంటుంది. ఈ  సినిమాగా వస్తున్న నుంచి 'కనుల చాటు మేఘమా' అంటూ సాగే మొదటి పాట లిరికల్ వీడియోను గురువారం ఉదయం విడుదల చేశారు. కళ్యాణి మాలిక్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. మేఘాల్లో తేలిపోతున్నామనే భావన కలిగించే అంత హాయిగా, ఆహ్లదకరంగా ఈ పాట సాగుతోంది. ప్రముఖ సినీ రచయిత లక్ష్మీ భూపాల ఈ పాటకు సాహిత్యం అందించడం విశేషం. "కనుల చాటు మేఘమా.. కాస్త ఆగుమా. వెనుక రాని నీడతో.. రాయబారమా" అంటూ ఆయన పాటను ఎంతో అందంగా ప్రారంభించారు. దీనికి ఆభాస్ జోషి గాత్రం అద్భుతంగా కుదిరి 'కనుల చాటు మేఘమా'ను మధురమైన పాటగా మలిచాయి. లిరికల్ వీడియో చూస్తుంటే ఓ పెళ్లి వేడుకలో కథానాయికను చూస్తూ కథానాయకుడు ఆమెతో గడిపిన క్షణాలను, ఆమె మిగిల్చిన జ్ఞాపకాలను తలచుకుంటూ పాడుతున్నట్లుగా ఉంది. వీడియోలో ప్రతి ఫ్రేమ్ హరివిల్లును తలపిస్తోంది. ఈ పాటకు రఘు మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.
 
ఈ పాట రచయిత లక్ష్మీ భూపాల్ మాట్లాడుతూ..'ఒకప్పుడు నాకు నచ్చిన కాంబినేషన్ వంశీ, ఇళయరాజా.. ఇప్పుడు ఈ జనరేషన్ లో అలాంటి కాంబినేషన్  శ్రీనివాస్ అవసరాల, కల్యాణి మాలిక్.. వాళ్లిద్దరి కలయికతో వచ్చే సినిమాల్లో పాటలకి ప్రత్యేకత ఉంటుంది.. అందమైన మెలోడీ ఉంటుంది.. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలో వారి కాంబినేషన్ లో చాలా చక్కటి మెలోడీ ట్యూన్ కి పాట రాసే అవకాశం నాకు రావడం నిజంగా అదృష్టం.. " కనులచాటు మేఘమా" అంటూ సాగే సాహిత్యం అద్భుతంగా కుదిరింది... అతిశయోక్తిలా అనిపించినా నా పాటకు నేనే ఫ్యాన్ అయిన సందర్భం ఇది... ఆభాస్ జోషి ప్రాణం పెట్టేశాడు తన తియ్యని గొంతులో... చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో ఇది ఖచ్చితంగా గుర్తిండిపోయే పాట అవుతుందని నమ్ముతున్నాను ..' అన్నారు. 
 
దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. "జ్యో అచ్యుతానంద తర్వాత నేను ఈ కథ అనుకుంటున్నప్పుడు కళ్యాణ్ గారికి ఇంకా చెప్పలేదు. కథలో ఈ పాట తాలూకు సందర్భం వచ్చినప్పుడు ఇది 'ఏం సందేహం లేదు', 'ఒక లాలన' పాటల స్థాయిలో ఉండాలి అనిపించి వెంటనే కళ్యాణ్ గారికి ఫోన్ చేసి.. "మనం ఒక లవ్ స్టొరీ చేస్తున్నాం అండీ.. అందులో నాకు చాలా ఇష్టమైన సందర్భం ఒకటి వచ్చింది. దానికి ఒక మంచి పాట కావాలి." అన్నాను. కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన మెలోడీని స్వరపరిచారు. లక్ష్మీ భూపాల గారు 'కనుల చాటు మేఘమా.. కాస్త ఆగుమా. వెనుక రాని నీడతో.. రాయబారమా' అంటూ సోల్ ఫుల్ లిరిక్స్ అందించారు. గతంలో నేను సోషల్ మీడియాలో ఆభాస్ జోషి పాటలు విని ఇలాంటి గొంతు మన సినిమాలో ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఇంత మంచి పాటను ఎవరి చేత పాడించాలి అనుకున్నప్పుడు.. ఆభాస్ జోషి గుర్తొచ్చి కళ్యాణ్ గారికి చెప్పాను. ఆయనకు కూడా ఆభాస్ జోషి గాత్రం ఎంతగానో నచ్చింది. సాంగ్ రికార్డింగ్ అయ్యాక కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి.. ఇంతమంచి గొంతుని నాకు పరిచయం చేసినందుకు చాలా థాంక్స్, ఆభాస్ జోషి పాడుతుంటే ఈ పాటకు రెండు చరణాలు కాకుండా యాభై చరణాలు ఉంటే బాగుండు అనిపించి అన్నారు. అప్పుడు నేను షూటింగ్ లో ఉన్నాను. షూటింగ్ అవ్వగానే వెంటనే వెళ్లి పాట విన్నాను. ఈ పాట చాలా తృప్తిని, చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి పాటలు చాలా అరుదుగా వస్తాయి. ఇంత అద్భుతమైన పాటని స్వరపరిచిన కళ్యాణ్ గారికి, లిరిక్స్ రాసిన లక్ష్మీ భూపాల గారికి ధన్యవాదాలు. ఆభాస్ జోషిని సింగర్ గా తెలుగులో పరిచయం చేయడం గర్వంగా ఉంది" అన్నారు.
 
సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ మాట్లాడుతూ.. "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి నాకు అంత్యంత ఇష్టమైన సినిమా, అంత్యంత మంచి సినిమా. ఇందులోని 'కనుల చాటు మేఘమా' అనే పాట నాకు ఎంతో ఇష్టమైనది. శ్రీనివాస్ గారు ఈ పాట సందర్భాన్ని వివరించినప్పుడు 'లగ్ జా గలే' అనే అద్భుతమైన పాటను రిఫరెన్స్ గా తీసుకోమని చెప్పారు. అంత గొప్ప పాట స్థాయిని అందుకోవడానికి నా శక్తి మేరకు ప్రయత్నించాను. ఈ పాట ఇచ్చిన తృప్తి నా 20 ఏళ్ల సినీ జీవితంలో ఏ పాట ఇవ్వలేదు. ఈ పాట చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని నేను నమ్ముతున్నాను. లక్ష్మీ భూపాల గారు అద్భుతమైన లిరిక్స్ అందించారు. ఈ పాట విన్నాక లక్ష్మీ భూపాల గారితో నేనొక మాట అన్నాను. మీరు, ఈ పాట పాడిన ఆభాస్ జోషి జాతీయ అవార్డు అందుకుంటారనే నమ్మకం ఉందని చెప్పాను. ఆభాస్ జోషి పేరుని శ్రీనివాస్ గారు సూచించారు. ఆయన గొంతు వినగానే నా మతిపోయింది. ప్రతి పాటని ఇదే నా చివరి అవకాశం అన్నట్లుగా ఎంతో ప్రేమతో, ఎంతో భక్తితో పాడతాడు. అంత గొప్ప గొంతుని పరిచయం చేసిన శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా థాంక్స్. ఇంత మధురమైన గొంతు చాలా అరుదుగా వింటాం. హిందీ గాయకుడు అయినప్పటికీ తెలుగు ఉచ్చారణ ఎంతో అద్భుతంగా పలికాడు. ఈ సినిమాతో పాటు, ఈ సినిమాలో పాటలు చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయని నమ్ముతున్నాను. శ్రీనివాస్ గారితో పనిచేయడం కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటాను" అన్నారు.