1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (15:14 IST)

టికెట్ ధ‌రల వివాదానికి శుభంకార్డు.. త్వరలోనే గుడ్ న్యూస్: చిరు

సినిమా టికెట్ ధరల అంశంపై టాలీవుడ్ నటులు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, నారాయణ మూర్తి తదితరులు గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. సినీ ప్రముఖులు సీఎం వైఎస్ జగన్ ను పూల గుత్తితో పలకరిస్తూ కనిపించారు. ఇప్పుడు ఒకే ఫ్రేమ్ లో సినీ సెలబ్రిటీల విజువల్స్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
సీఎం జగన్‌తో తెలుగు సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో వారు చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశంలో చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి పాల్గొన్నారు. నాగార్జున, జూనియ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, దిల్ రాజు హాజ‌రుకాలేదు. ప్ర‌భుత్వం ముందు టాలీవుడ్ ప్ర‌ముఖులు ప‌లు ప్ర‌తిపాద‌న‌లు ఉంచారు.
 
సమావేశం అనంత‌రం సినీనటుడు మ‌హేశ్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. మొద‌ట‌గా చిరంజీవి గారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఆయ‌న మొద‌టి నుంచీ చొర‌వ చూపి స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేశార‌ని అన్నారు. త్వ‌ర‌లోనే ఓ గుడ్ న్యూస్ వింటార‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. 
 
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. టికెట్ ధ‌రల వివాదానికి శుభంకార్డు ప‌డింద‌ని భావిస్తున్నామ‌ని చెప్పారు. ఏపీ సీఎం నిర్ణ‌యం అంద‌రినీ సంతోష‌ప‌ర్చింద‌ని చెప్పారు. చిన్న సినిమాల‌కు ఐదో షోకు అనుమ‌తించ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని తెలిపారు. చిన్న సినిమాల నిర్మాత‌ల‌కు మంచి వెసులుబాటు ఇచ్చార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా తెలుగు సినిమాల గురించి గొప్పగా ప్రచారం జ‌రుగుతోంద‌ని చిరంజీవి హ‌ర్షం వ్య‌క్తం చేశారు.