గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 ఆగస్టు 2020 (11:40 IST)

నిలకడగా ఎస్బీ బాలు ఆరోగ్యం... భార్యకు కూడా కరోనా పాజిటివ్

కరోనా వైరస్ బారినపడిన ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆయన కుమారుడు ఎస్.బి. చరణ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం రాత్రి మీడియా ముందుకు వచ్చి ఓ క్లారిటీ ఇచ్చారు. అలాగే, ఎస్పీబీ ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నట్టు చెన్నై చూలైమేడులోని ఎంజీఎం హెల్త‌కేర్ ఆస్పత్రి విడుదల చేసిన ఓ హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. 
 
ఇదే అంశంపై ఎస్.బి. చరణ్ మీడియాతో స్పందిస్తూ, 'చికిత్సకు నాన్న బాగా స్పందిస్తున్నారు. శుక్రవారంతో పోలిస్తే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడింది' అని చెప్పారు. అయితే, ఆయన పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. శుక్రంతో పోల్చితే శనివారం కాస్త మెరుగుగా ఉందని తెలిపారు. 
 
మరోవైపు, తమిళనాడు ఆరోగ్య మంత్రి సి. విజయ్‌భాస్కర్‌ శనివారం బాలసుబ్రమణ్యం ఆరోగ్యపరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున కూడా ఎలాంటి సహాయమైన చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి విజయభాస్కర్ హామీ ఇచ్చారు.
 
ఇదిలావుండగా, ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యం భార్య ఎస్పీ సావిత్రి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న సమయంలో బాలు భార్య సావిత్రికి కూడా కరోనా వచ్చిందనే వార్త బాలు అభిమానులను మరింత ఆందోళనకు గురి చేసేలా ఉంది. 
 
బాలు ఆరోగ్యం కుదుటపడాలంటూ ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. తిరుమలలో కొందరు బాలు ఆరోగ్యం కోసం వెంకన్నకు కొబ్బరికాయలు కొట్టి తమ అభిమాన గాయకుడు త్వరగా కోలుకునేలా చూడాలని ప్రార్థించారు.