శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (08:45 IST)

మర్యాదగా వచ్చి ఓ గంట గడిపి వెళ్లు... శ్రావణికి దేవరాజ్ వార్నింగ్

మనసు మమత, మౌనరాగం వంటి సీరియల్స్‌లో నటించి మంచి పేరు సంపాదించిన బుల్లితెర నటి శ్రావణి. ఈమె హైదరాబాద్ నగరంలోని మధురా నగర్‌లో ఉన్న తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు దేవరాజ్ రెడ్డి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ప్రియుడు మాత్రం శ్రావణి ఇంట్లో ఉండే సాయి అనే వ్యక్తి వల్ల సూసైడ్ చేసుకుందని ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రావణిని ఫోనులో దేవరాజ్ రెడ్డి బెదిరించినట్టుగా ఉండే ఆడియో ఒకటి లీక్ అయింది. అది ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 
 
తనకు, ఆమె ఆత్మహత్యకు సంబంధం లేదని చెప్పిన కొన్ని గంటల్లోనే శ్రావణిని దేవరాజ్ రెడ్డి బెదిరించిన ఆడియో బయటకు రావడంతో కేసు మరో మలుపు తిరిగింది. ఈ ఆడియో టేపులో దేవరాజు రెడ్డి మాట్లాడుతూ.. మర్యాదగా తనతో వచ్చి ఓ గంట గడపాలని, లేదంటే తర్వాత జరిగే పరిణామాలకు తాను బాధ్యుడిని కానని హెచ్చరించడం స్పష్టంగా ఉంది. అతడి బెదిరింపులకు శ్రావణి స్పందిస్తూ ఇక జరిగింది చాలని, ఇక్కడితో ఆపేయాలని, నీతో మాట్లాడనని ప్రాధేయపడింది. 
 
ఇదిలావుంటే, శ్రావణి ఆత్మహత్య చేసుకున్న వార్త బయటకు వచ్చిన తర్వాత దేవరాజ్ మాట్లాడుతూ, శ్రావణి ఆత్మహత్యతో తనకు సంబంధం లేదని, సాయి కృష్ణారెడ్డి అనే వ్యక్తే ఇందుకు అసలు కారణమని ఆరోపించాడు. దేవరాజ్ తనపై చేసిన ఆరోపణలపై సాయి కూడా స్పందించాడు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నాడు. శ్రావణి కుటుంబానికి తాను స్నేహితుడిని మాత్రమేనని, ఆమె జీవితాన్ని కాపాడేందుకు తాను చాలా ప్రయత్నించానని పేర్కొంటూ ఓ వీడియో విడుదల చేశాడు.
 
ఆమె ఆత్మహత్యకు పాల్పడినప్పటి నుంచి ఆ కుటుంబంతోపాటే ఉన్నానని పేర్కొన్నాడు. ఆమె కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని కృష్ణారెడ్డి పేర్కొన్నాడు. కాగా, దేవరాజు రెడ్డిపై శ్రావణి గతంలోనే బెదిరింపులు, అత్యాచారయత్నం వంటి కేసులు పెట్టింది. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు దేవరాజ్ కోసం గాలిస్తున్నారు.