బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (10:55 IST)

దేశానికి అన్నం పెట్టే రైతులు సైనికులు : ప్రియాంకా చోప్రా

కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని హస్తిన సరిహద్దుల్లో రైతులు గత మూడు వారాలుగా ఆందోళన చేస్తున్నారు. గజగజ వణికే చలిలోనూ రైతులు ఏమాత్రం వెనుకంజ వేయకుండా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి రైతులకు ప్రతి ఒక్కరూ తమ సంఘీభావం, మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా, సినీ సెలెబ్రిటీలు సైతం అండగా నిలుస్తున్నారు. వారి ఉద్యమానికి మద్దతుగా నిలుస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.
 
ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. తాజాగా, బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా కూడా మద్దతు ప్రకటించారు. వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశానికి ఆహారాన్ని అందించే సైనికులుగా రైతులను అభివర్ణించిన ప్రియాంక.. ఇలాంటి సంక్షోభానికి వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
 
కరోనాకు కూడా కలత చెందకుండా రైతులు తమ కుటుంబ సభ్యులతో వణికించే చలిలో ఉద్యమం చేస్తున్నారని, వారి ఆందోళనకు తన హృదయం ద్రవించిపోతోందని మరో నటి ప్రీతి జింటా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. 
 
నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ కూడా రైతులకు మద్దతుగా ముందుకొచ్చాడు. తాను రైతుల పక్షాన నిలబడతానని పేర్కొన్నాడు. నేడు మనం అన్నం తింటున్నామంటే రైతుల చలవేనన్నాడు. అలాగే, తాప్సి, సోనమ్ కపూర్, దివ్యాదత్తా, పరిణీతి చోప్రా వంటి వారు కూడా రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు.