పిఠాపురంలో పవన్ పైన పోటీ చేసేందుకు నేను సిద్ధం: రాంగోపాల్ వర్మ  
                                       
                  
				  				  
				   
                  				  రాంగోపాల్ వర్మ మరో బాంబు పేల్చారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి తను బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యానని చెప్పారు. తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఈమేరకు ప్రకటించారు. తను ఈ నిర్ణయాన్ని ఆకస్మికంగా తీసుకున్నాననీ, పవన్ పైన పోటీ చేసేందుకు పూర్తిగా సమాయత్తమయ్యానంటూ వెల్లడించారు. గత కొన్ని నెలలుగా వర్మ వైసిపికి అనుకూలంగా వున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాంగోపాల్ వర్మ వైసిపి నుంచి బరిలోకి దిగుతారేమోనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
				  											
																													
									  
	 
	పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా: పవన్
	ఏపీ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం ఏదో తేలిపోయింది. ఆయన పీఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు గురువారం స్వయంగా ప్రటించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో ఆయన గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. దీనికి ఆయన తెరదించారు. పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్టు గురువారం స్వయంగా ప్రకటించారు. అలాగే, ప్రస్తుతానికి తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. 
				  
	 
	గత 2014లో పార్టీ స్థాపించగానే పిఠాపురం నుంచి పోటీ చేయాలని చాలా మంది అడిగారన్నారు. తెలంగాణ నుంచి, పిఠాపురం నుంచి పోటీచేయమంటూ తనకు వినతులు వచ్చాయన్నారు. అయితే, రాష్ట్రం కోసం ఆలోచించి అపుడు పిఠాపురం నుంచి పోటీ చేయలేకపోయానని చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఎన్నికల గురించి తాను ఎపుడూ ఆలోచించలేదని, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిలబడదామని అనుకున్నానని, అందుకే 2014లో పార్టీ ఆఫీస్ను కూడా అక్కడ నుంచి ప్రారంభించానని చెప్పారు.