1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (13:41 IST)

'బలగం' సింగర్ మొగిలయ్యకు భరోసా ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

chiranjeevi
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 'బలగం' సింగర్ మొగిలయ్యకు మెగాస్టార్ చిరంజీవి భరోసా ఇచ్చారు. మొగిలయ్యకు కంటి చూపు వచ్చేందుకు అవసరమయ్యే ఖర్చు మొత్తాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చిరంజీవి హామీ ఇచ్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
'బలగం' చిత్రంలో పాడిన పాటలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన మొగిలయ్యకు కిడ్నాలు దెబ్బతినడంతో పాటు మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు కావడంతో ఆయన కంటి చూపు కూడా మందగించింది. వీటికితోడు ఇటీవలే గుండెనొప్పి కూడా రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే మొగిలయ్యను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, మొగిలయ్యకు దీర్ఘాకాలిక మధుమేహం ఉండటంతో కంటిచూపు కూడా మందగించింది. నిమ్స్‌లో కంటి వైద్య నిపుణులు ఆయన్ను పరీక్షించారు. కాగా, మొగిలయ్య దీనస్థితిని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. మొగిలయ్యకు తిరిగి కంటిచూపు వచ్చేందుకు ఎంత ఖర్చైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 
 
ఈ విషయాన్ని "బలగం" చిత్రం దర్శకుడు వేణుకు ఫోన్ చేసి భరోసా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ విషయాన్ని వెంటనే దర్శకుడు వేణు.. ఆగమేఘాలపై మొగిలయ్య కుటుంబ సభ్యులకు చేరవేశారు. కాగా, ఇటీవల మొగిలయ్యను ఓ ట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో ఆయన తన దీనస్థితిని వివరించారు.