గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (16:08 IST)

సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్టు! వైద్య పరీక్షల తర్వాత...

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూసింది. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మంగళవారం అరెస్టు చేసింది. గత రెండు మూడు రోజులుగా ఆమె వద్ద విచారణ జరిపి, పలు విషయాలు రాబట్టిన తర్వాత అరెస్టు చేశారు. 
 
తమ విచారణలో రియా చక్రవర్తికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు నిర్ధారించుకున్న తర్వాతే అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో రియాను మూడు రోజుల పాటు ఎన్‌సీబీ విచారించింది. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా ఎన్‌సీబీ అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సుశాంత్‌ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో రియా అంగీకరించింది.
 
అయితే.. తాను మాత్రం డ్రగ్స్ వినియోగించలేదని, కేవలం సుశాంత్ కోసమే కొనుగోలు చేశానని రియా చెప్పుకొచ్చింది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా.. సుశాంత్ కేసులో డ్రగ్స్ వినియోగం దగ్గర మొదలైన విచారణ, బాలీవుడ్‌లో డ్రగ్స్ మత్తులో మునిగితేలే వారి పేర్లను రియా బయటపెట్టేవరకూ వెళ్లింది. మొత్తం 25 మంది బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లను ఎన్‌సీబీ విచారణలో రియా చక్రవర్తి బయటపెట్టినట్టు సమాచారం. 
 
కాగా, దర్యాప్తులో ఎన్సీబీ వేగం పెంచడం చూస్తుంటే సుశాంత్ మరణంలో డ్రగ్స్ వ్యవహారమే కేంద్రబిందువుగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. కాగా, రియా చక్రవర్తి ప్రస్తుతం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో ఉంది. ఆమెను ఇవాళ రెండు దఫాలుగా విచారించిన ఎన్సీబీ అధికారులు మరోసారి విచారించేందుకు సిద్ధమవుతున్నారు. రియాను మంగళవారం కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపించడంలేదు. రియాకు తొలుత వైద్య పరీక్షలు నిర్వహించాల్సివుంది. అలాగే, అన్ని రకాల పేపర్ వర్క్ పూర్తి చేసిన తర్వాత అరెస్టును ఎన్.సి.బి అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.