శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జనవరి 2020 (11:03 IST)

'సరిలేరు నాకెవ్వరు' అంటున్న ప్రిన్స్ మహేష్.. అరుదైన రికార్డు... ఏంటది?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం "సరిలేరు నీకెవ్వరు". ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో "సరిలేరు నాకెవ్వరు" అని మహేష్ బాబు అంటున్నారు. దీనికి కారణం.. ఈ హీరో ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరడమే. 
 
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కోసం జనవరి 11వ తేదీన విడుదలైంది. ఇందులో రష్మక మందన్నా హీరోయిన్ కాగా, సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రను పోషించింది. అయితే, ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫలితంగా మహేష్ బాబు మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 
 
'స్పైడర్' తర్వాత వచ్చిన "భరత్ అనే నేను", 'మహర్షి' చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్. ఇపుడు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం కూడా ఈ జాబితాలోకే చేరింది. పైగా, ఈ చిత్రం ఓవర్సీస్‌లో కేవలం రెండు రోజుల్లోనే 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే, ఈ మొత్తంలో కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా 'సరిలేరు నీకెవ్వరు' ఏడో చిత్రంగా నిలిచింది. 
 
గతంలో మహేష్ నటించిన 'దూకుడు', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు', 'శ్రీమంతుడు', 'స్పైడర్', 'భరత్ అనే నేను', 'మహర్షి' చిత్రాలు కూడా ఓవర్సీస్‌లో తమ హవాను కొనసాగించి అతి తక్కువ కాలంలోనే 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేశాయి. ఇపుడు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం మహేష్ ఖాతాలో ఏడో చిత్రంగా నిలిచింది.