శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (12:32 IST)

హీరో సూర్య గొంతుకైన తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి ఇకలేరు

srinivasamurthy
ప్రముఖ హీరోలు సూర్య, అజిత్, మోహన్ లాల్, డాక్టర్ రాజశేఖర్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు తెలుగులో డబ్బింగ్ చెబుతూ వచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి చెన్నైలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన గుండెపోటు కారణంగా చనిపోయారు. ఊబకాయ సమస్యతో బాధపడుతూ వచ్చిన ఆయనకు శుక్రవారం ఉదయం తన నివాసంలో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. దీంతో ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. 
 
తమిళ స్టార్ హీరో సూర్యకు శ్రీనివాసమూర్తి చెప్పిన డబ్బింగ్ కారణంగానే మంచి పాపులర్ అయ్యారు. సూర్య నటించిన అన్ని తెలుగు చిత్రాలకు ఆయనే డబ్బింగ్ చెబుతూ వచ్చారు. అలాగే, అజితే, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు డబ్బింగ్ చెప్పారు. జనతా గ్యారేజ్ చిత్రంలో మోహన్ లాల్ పాత్రకు ఈయనే డబ్బింగ్ చెప్పి జీవం పోశారు. 
 
ముఖ్యంగా, హీరో బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా డబ్బింగ్ చెప్పడంలో శ్రీనివాసమూర్తికి మించినవారు లేరని చెప్పొచ్చు. తెలుగు హీరో డాక్టర్ రాజశేఖర్‌కు సాయికుమార్ అందుబాటులో లేని సమయంలో కూడా శ్రీనివాసమూర్తి డబ్బింగ్ చెప్పసాగారు. అలాంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్‌ను తెలుగు చిత్రపరిశ్రమ కోల్పోయింది. 
 
అయితే, చిత్రపరిశ్రమలోని డబ్బింగ్ ఆర్టిస్టులకు దక్కాల్సిన గౌరవమర్యాదలు దక్కడం లేదని దివగంత అక్కినేని నాగేశ్వర రావు వంటి వారు అంటుండేవారు. శ్రీనివాస మూర్తి విషయంలోనూ ఇదే జరిగింది. అందుకే ఆయన తెలుగులో ఎక్కువ సినీ అవకాశాలు పొందలేకపోయారు. అయితే, హీరో సూర్యకి డబ్బింగ్ చెప్పిన తర్వాత శ్రీనివాస రావు మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.