శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 అక్టోబరు 2020 (13:59 IST)

దేశంలోని పేదలకు ఓటు హక్కు వద్దు... : విజయ్ దేవరకొండ

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. మన దేశంలో రాజకీయ వ్యవస్థ అర్థంపర్థం లేకుండా ఉందని చెప్పుకొచ్చారు. పైగా, తనకు రాజకీయాలు చేసేటంత ఓపిక లేదన్నారు. అలాగే, ఓటు హక్కు కూడా డబ్బుకు అమ్ముకునే వారికి ఉండకూడదని, కేవలం మధ్యతరగతి ప్రజలకు మాత్రమే ఉండాలని కోరారు. 
 
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ ఇస్తూ, దేశంలో రాజకీయ విధానాలు, ఓటు హక్కు లాంటి అంశాలపై త‌న వాద‌న‌ను వినిపించాడు. ఓటు హక్కు  పేద వాళ్లకు, డబ్బున్న వాళ్లకు ఉండకూడదని, కేవలం మధ్య తరగతి వారికి మాత్రమే ఉండాల‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డంతో ప్ర‌స్తుతం ఈ టాపిక్ సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్రదుమారం రేపుతుంది.
 
తనకు రాజ‌కీయాలు చేసే అంత ఓపిక లేదు. మ‌న దేశంలో రాజ‌కీయ వ్య‌వ‌స్థ అర్థంపర్థం లేకండా ఉంది. ఓ వైపు ఓటర్లు డబ్బుకు, లిక్కర్‌కు అమ్ముడుపోవడం మరోవైపు రాజకీయ నాయకులు మందు, డబ్బుతో ఓటర్లను కొనడం అన్నీ సర్వసాధారణం అయిపోయాయి. 
 
ఇలా లిక్కర్ తీసుకుని ఓటు వేసే వారికి ఓటు హక్కు ఉండకూడదంటూ ఎన్నికల సమయంలో ఏరులై పారుతున్న నగదు ప్రవాహంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను వెంటనే ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని విజయ్ దేవరకొండ అన్నారు. డబ్బు కోసం ఓటు అమ్ముకునే వారికి ఓటుకు ఉన్న విలువ తెలియదని, అలాంటి వారికి ఓటు హక్కును తొలగించడమే సరైన చర్య అని విజయ్ పేర్కొన్నారు
 
ఓ విమానం నడిపే పైలట్‌ని అందులో ఎక్కే 300 మంది ప్రయాణికులు ఓట్లు వేసి ఎన్నుకోరు కదా! అలాగే సమాజాన్ని నడిపే బాధ్యతను కూడా సమాజంపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడి చేతిలో పెట్టాలి అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.