గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2020 (16:07 IST)

ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.. హైకోర్టు

తమిళనాడులోని అధికార అన్నాడీఎంకేకు చెందిన కళ్ళకురిచ్చి ఎమ్మెల్యే ప్రభు ప్రేమ వ్యవహారంపై మద్రాసు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. ప్రేమికులిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని పేర్కొంది. ముఖ్యంగా, వధువు సౌందర్యం ఇష్టపడే ఎమ్మెల్యే ప్రభును పెళ్లి చేసుకున్నట్టు చెప్పిందని హైకోర్టు గుర్తుచేసింది. 
 
ఇటీవల కళ్ళకురిచ్చి అన్నాడీఎంకే ఎమ్మెల్యే, దళిత వర్గానికి చెందిన ప్రభు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సౌందర్య అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, ఈ పెళ్లిని సౌందర్య కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సౌందర్య తండ్రి స్వామినాథన్ ఎమ్మెల్యే ప్రభు ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. ఆ తర్వాత ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
 
తన కుమార్తెను ఎమ్మెల్యే ప్రభు అపహరించాడని, బెదిరించి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. వధువును తమ ఎదుట హాజరుపరచాలంటూ ఎమ్మెల్యే ప్రభును ఆదేశించి శుక్రవారానికి కేసు విచారణను వాయిదా వేసింది. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం వధూవరులిద్దరూ కోర్టుకు వచ్చారు. అపుడు వధువు సౌందర్యను న్యాయస్థానం వివరాలు అడిగి తెలుసుకుంది. ఆమె తండ్రి స్వామినాథన్ చేసిన ఆరోపణలు నిజమేనా అని ప్రశ్నించగా, తనను ఎవరూ అపహరించలేదని, బెదిరించలేదని వివరించింది. తాను ప్రభును ప్రేమించానని, అతడిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని సౌందర్య స్పష్టం చేసింది.
 
సౌందర్య స్వయంగా చెప్పడంతో హైకోర్టు జడ్జి స్వామినాథన్ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఇద్దరూ మేజర్లేనని, ఎమ్మెల్యే ప్రభు-సౌందర్య ప్రేమవివాహం చెల్లుతుందని తీర్పు ఇచ్చింది.