గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (16:00 IST)

హర్యానాలో కర్నాటక రాజకీయం పునరావృతం కాదు : జీవీఎల్

హంగ్ అసెంబ్లీ ఏర్పడిన హర్యానా రాష్ట్రంలో కర్నాటక రాజకీయాలు పునరావృతం కానివ్వబోమని బీజేపీ రాజ్యసభ జీవీఎల్ నరసింహా రావు స్పష్టం చేశారు. గురువారం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో మహారాష్ట్రలో బీజేపీ కూటమి మరోమారు అధికారాన్ని నిలబెట్టుకోగా, హర్యానా రాష్ట్రంలో మాత్రం బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఐదు సీట్ల దూరంలో వచ్చి ఆగిపోయింది. 
 
ఈ ఫలితాలపై జీవీఎల్ నరసింహా రావు స్పందిస్తూ, హర్యానాలో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోయినా కర్ణాటక తరహా పరిస్థితి రాబోదని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. అటు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందన్నారు. హర్యానాలో స్థానిక పరిస్థితులు కాస్త ప్రతికూలంగా మారాయని, అందుకే ఈ తరహా ఫలితాలు వెల్లడైనట్టు తెలిపారు. 
 
మరోవైపు, మహారాష్ట్ర ఫలితాలు బీజేపీ కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ... హర్యానా ఫలితాలు మాత్రం ఆ పార్టీకి నిరాశను కలిగించాయి. మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలను కూడా గెలవలేకపోయింది. దీంతో ఇతరులను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో, ఫలితాలకు బాధ్యత వహిస్తూ హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాకు పంపించారు.