1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2020 (15:51 IST)

కేన్సర్ రోగుల పట్ల విద్యార్థినుల ఔదార్యం.. శిరోజాల దానం

కేన్సర్ రోగుల పట్ల కొందరు విద్యార్థులు తమ ఔదార్యాన్ని చూపించారు. ఇందులోభాగంగా, వారు తమ శిరోజాలను దానంగా ఇచ్చారు. ఈ మానవతా దృక్పథంతో కూడిన చర్య తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోయంబత్తూరు జిల్లాలో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన విద్యార్థినులు కేన్సర్ రోగులకు ఏదో రూపంలో సాయం చేయాలని భావించారు. ఇందులోభాగంగా, వారు కేన్సర్‌ నిర్ధారణ అయిన రోగులకు తమ వెంట్రుకలను దానం చేశారు. 
 
సాధారణంగా కేన్సర్ నిర్ధారణ అయిన రోగులకు జుట్టును కత్తిరిస్తారు. అలాంటి రోగులకు జుట్టు దానం చేసి వారిలో ఆనందాన్ని నింపాలనే సంకల్పంతోనే ఇలాంటి చర్యకు పూనుకున్నారు. ఈ ప్రైవేటు కాలేజీకి చెందిన 80 మంది విద్యార్థినిలు తమ జుట్టును కేన్సర్‌ రోగులకు దానంగా ఇచ్చారు. ఈ జుట్టుతో విగ్‌లను తయారు చేసి కేన్సర్‌ పేషెంట్లకు ఇవ్వనున్నారు. 
 
తమ ఔదార్యంపై పలువురు విద్యార్థినిలు స్పందిస్తూ, కేన్సర్‌ రోగులకు ఆర్థికంగా సహాయం చేయలేం. కానీ, వారు వెంట్రుకలు లేక బాధపడుతుంటారు. ఇలాంటివారికి తమ జుట్టును దానం చేసి.. వారిలో ఆనందాన్ని నింపాలనుకున్నాం. అందుకే తామంతా కలిసి సామూహికంగా శిరోజాలను దానం చేసినట్టు చెప్పారు. కేన్సర్ రోగుల పట్ల మానవీయ కోణంలో ఆలోచించిన విద్యార్థినులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.