మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (09:04 IST)

కరోనా వైరస్ సోకిన అధికారిని కాల్చి చంపిన ఉత్తర కొరియా?

చైనాతో పాటు పలు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ భయకంపితులను చేస్తోంది. ముఖ్యంగా, చైనాలో ఈ వైరస్ ధాటికి మృత్యుకేళి కొనసాగుతోంది. అలాగే, పలుదేశాల్లో ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. చైనాలో అయితే ప్రతి రోజూ ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్యకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. 
 
ఈ నేపథ్యంలో ఈ కరోనా వైరస్ తమ దేశంలోకి ప్రవేశించకుండా ఉత్తర కొరియా కఠినంగా ఆంక్షలను అమలు చేస్తోంది. ఇందుకోస సైనిక చట్టాలను సైతం అమలు చేస్తోంది. గతంలో చైనాలో మొదలైన సార్స్ వైరస్‌ను నిరోధించడానికి ఉత్తర కొరియా కఠిన నిబంధనలు అమలు చేసిన విషయం తెలిసిందే. ఇపుడు అలాంటి కఠిన చట్టాలనే అమలు చేస్తోంది. 
 
ఇటీవల చైనాకు వెళ్లి వచ్చిన ఓ అధికారికి కరోనా వైరస్ సోకిందన్న కారణంగా కాల్చివేసిందని.. పొరుగుదేశమైన దక్షిణ కోరియా మీడియా గురువారం ఓ వార్తను ప్రచురించింది. అ అధికారి విధి నిర్వహణలో భాగంగా ఇటీవల చైనాకు వెళ్లి రావడంతో ఉత్తర కొరియా అధికారులు ఆ అధికారిని తొలుత నిర్బంధించారు. అయితే ఆ అధికారి ఓ పబ్లిక్ బాత్ రూంలో స్నానం చేయడానికి వెళుతున్న సమయంలో అధికారులు గుర్తించి కాల్చి వేశారని దక్షిణ కొరియా మీడియా కథనం.
 
అలాగే, చైనా నుంచి వచ్చిన వారిని, చైనా ప్రజలను నిర్బంధించాలని ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు జారీచేశారు. చైనాతో సరిహద్దులను మూసివేశారు. రోడ్డు మార్గాలు మూసివేయడమో లేక కఠిన నిషేధాలు అమలు చేయడమో అమలు చేస్తోంది. పర్యాటకులను నిషేధించింది. కరోనా వైరస్ చాయలు తమదేశంలోకి రాకుడదన్న సంకల్పంతో దేశలో సైనిక చట్టాలను అమలు చేస్తోంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే.. చర్యలు ఎలా ఉంటాయన్నది తాజా ఘటనతో ప్రపంచానికి చాటింది.