బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (09:43 IST)

అక్కతో కలిసి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తే.. పాము కాటేసింది.. ఎక్కడ?

ఈ మధ్య అడవుల్లో నివసించే పులులు జన సంచారంలోకి వస్తున్నాయి. అలాగే పుట్టల్లో వుండే పాములు కూడా జనవాసాల్లో తిరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడేళ్ల ఓ చిన్నారి అక్కతో కలిసి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది. పిల్లతో కలిసి ఆడుకుంటున్న సమయంలో పాము కాటేసింది. సరైన సమయంలో వైద్యం అందక ఆ పసిపాప కన్నుమూసింది. కృష్ణా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో రామవరపుమోడి గ్రామానికి చెందిన నాగ అనూష, నాగ మల్లేశ్వరరావు భార్యా భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె పేరు వర్షిణి (4), చిన్న కుమార్తె పేరు స్నేహ స్వాతి (3). వర్షిణి ప్రతి రోజు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లుంది. ఐతే మంగళవారం స్నేహస్వాతి తన అక్కతో పాటు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది.
 
అక్కడ తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో... కోడిగుడ్ల ట్రే పక్కనే ఉన్న ఓ పాము స్వాతిని కాటేసింది. నొప్పితో చిన్నారి ఏడవడంతో అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది ఇంటికి పంపించారు. కానీ పాము కరించిందని ఎవరికీ తెలియదు. పాప ఏడూస్తూ చేయి చూపించడంతో.. పాము కరిచిందని తల్లిదండ్రులు అనుమానించారు. మొదట గ్రామంలోనే నాటు వైద్యం చేయించారు. 
 
అనంతరం గ్రామస్తుల సలహాతో కృత్తివెన్ను మండలంలోని చిన్నపాండ్రాక ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేశారు. పాప ఆరోగ్య పరిస్థితి విషమించిందని పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. పాపను మచిలీపట్నం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లుండగా మార్గమధ్యలోనే అంబులెన్స్‌లో కన్నుమూసింది. స్నేహస్వాతి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.