గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 3 జూన్ 2019 (12:13 IST)

కుప్పంపై కన్నేసిన సీఎం జగన్.. ఏంటి సంగతి?

సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన మూడు రోజుల వ్యవధిలోనే కుప్పంలో నిధుల ఖర్చుపై రాష్ట్ర సచివాలయ ఉన్నతాధికారుల ఆరా తీయడం జిల్లాలో సంచలనంగా మారింది. 2014 నుంచి కుప్పం నియోజకవర్గానికి మంజూరైన నిధులు, వాటి వినియోగం, ప్రస్తుతం ఆ పనులు ఏ దశలో ఉన్నాయో వివరాలు ఇవ్వాలంటూ ఆయా శాఖల ఉన్నతాధికారులు నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. 
 
జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సంబంధం లేకుండా నేరుగా జిల్లా అధికారులకు ఈ ఆదేశాలు అందడం గమనార్హం. పంచాయితీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు భవనాలు, విద్యాశాఖ అధికారులకు అమరావతి నుంచి ఈ మేరకు ఆదేశాలు అందాయి. స్వయంగా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఈ మేరకు వివరాలు తెప్పించాలని కోరగా, ఆయా శాఖల అధికారులు చిత్తూరు జిల్లా అధికారులకు ఈ లేఖలను ఫార్వర్డ్ చేశారు. 
 
ఆదివారం సెలవు సైతం పక్కన పెట్టి నివేదిక తయారీలో జిల్లా అధికారులు బిజీగా ఉన్నారు. 
కుప్పం నియోజకవర్గ పరిధిలో కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లె మండలాలు ఉన్నాయి. గడచిన అయిదేళ్లుగా ఈ నాలుగు మండలాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయి.

పంచాయతీ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు నిర్మించారు. ఇందుకోసం దాదాపు 1500 కోట్ల రూపాయల నిధుల వినియోగం జరిగింది. వీటి వివరాలను పంపుతున్నారు. అలాగే అవి ఏ దశలో ఉన్నాయో కూడా వివరాలు నివేదికలో పొందుపరచనున్నారు. ఏదిఏమైనా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గ నిధులపై రాష్ట్ర సచివాలయ అధికారుల ఆరా సంచలనంగా మారింది.