1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 4 డిశెంబరు 2021 (14:35 IST)

కేంద్ర మంత్రి షెకావత్ వెన‌క సుజ‌నా చౌద‌రి, సిఎం ర‌మేష్ రాజ‌కీయం

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యలు పూర్తిగా అవగాహనా రాహిత్యంతో కూడినవ‌ని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖా మంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ విమ‌ర్శించారు. ప్రాజెక్టు గేట్ల కెపాసిటీకి మించి హఠాత్తుగా వచ్చిన వరదతోనే అన్నమయ్య ప్రాజెక్టు వద్ద అనూహ్యంగా వరద కట్టలు తెంచుకుంద‌న్నారు. ఇటువంటి సంఘటనే ఉత్తరాఖండ్ లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగి, 150 మంది జల సమాధి అయ్యారన్నది తెలియదా అని మంత్రి ప్ర‌శ్నించారు. అయితే, అక్కడ అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ కాబట్టి, నిజాల్ని దాచే ప్రయత్నం చేశార‌న్నారు. 
 
 
అన్నమయ్య ప్రాజెక్టులో ఐదో గేటు తెరుచుకున్నా, అందులో నుంచి బయటకు వెళ్ళగల నీటి సామర్థ్యం 40 వేల క్యూసెక్కులు అయితే, వరద 3 లక్షల క్యూసెక్కులకు పైనే అని మంత్రి వివ‌రించారు. ఒక గేటు తెరుచుకోలేదన్న వాదనకు విలువ లేద‌ని, ఈ అంశం స్పష్టంగా తెలిసినా, షెకావత్  ఈ విషయంలో నిజాలు విస్మరించార‌న్నారు. 
 
 
ఈ మొత్తం కట్టు కథను షెకావత్ వెనక కూర్చున్న సీఎం రమేష్, సుజనా చౌదరి కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం తరఫున వినిపించి ఉంటారని అన్నారు. ఏం జరిగిందన్న విషయాన్ని జిల్లా కలెక్టర్ నుంచి గానీ, ప్రాజెక్టు అధికారులతో గానీ, కేంద్ర ప్రభుత్వం సంప్రదించకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా, ఇటువంటి ప్రకటనలు చేయడం దారుణ‌మ‌న్నారు. నిరాధారమైన, అత్యంత సున్నితమైన అంశాలను సాక్షాత్తూ పార్లమెంటులో మాట్లాడటం, ఎంతవరకు సమంజసమన్నది వారు కూడా ఆలోచించాల‌న్నారు.  నిరాధారమైన ఈ వ్యాఖ్యలను పట్టుకుని తెలుగుదేశం పార్టీ చేస్తున్న యాగీ చూస్తే, జల ప్రళయంలో కూడా ఇంత దిగజారిన రాజకీయం చేయవచ్చా అన్నది ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల‌న్నారు.