గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 26 నవంబరు 2021 (13:48 IST)

శాసన మండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌

నా అక్క ఆ సీట్లో కూర్చోవ‌డం నాకు చాలా సంతోషంగా ఉంద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంబ‌ర‌ప‌డిపోయారు. శాసన మండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా ఎమ్మెల్సీ జకియా ఖానమ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా జకియా ఖానమ్‌ను సీఎం వైయస్‌.జగన్ అభినందించారు. 
 
 
ఈ రోజు అధ్యక్షా అని సంభోదించే స్ధానంలో నా అక్క జకియా ఖానమ్‌ అమ్మ కూర్చోవడం చాలా సంతోషంగా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక గృహిణిగా చట్ట సభల్లో అడుగుపెట్టడమే కాకుండా, డిప్యూటీ  చైర్మన్‌గా ఈ రోజు ఆ స్ధానంలో కూర్చున్న ఆమె అంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం అన్నారు. నిజంగా మైనార్టీ అక్క చెల్లెమ్మలందరికీ ఇది ఒక సంకేతం, ఒక సందేశం. మహిళలు అన్ని రకాలుగా పైకి రావాలి, ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలి, ప్రభుత్వమన్నది తోడుగా ఉండాలి అన్న మన ప్రయత్నం ఈ రెండున్నర సంత్సరాలుగా జరుగుతోంద‌ని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. 
 
 
అందులో భాగంగా దేవుడు ఈ రోజు నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు సంతోషిస్తున్నాన‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు. మీకు మంచి జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అని సీఎం వైయస్‌.జగన్‌ డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.