1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 2 జనవరి 2023 (10:54 IST)

భారీ బందోబస్తు కల్పించాం.. కానీ బారికేడి విరిగిపోవడంతో తొక్కిసలాట.. గుంటూరు ఎస్పీ

stempede
గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై గుంటూరు జిల్లా ఎస్పీ స్పందించారు. ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ తరపున జరిగిన చంద్రన్న కానుకల పంపిణీకి భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు కల్పించామని చెప్పారు. అయితే, ఒకటో నంబరు కౌంటర్ వద్ద బారిగేడ్ విరిగిపోవడంతో ఓ మహిళ కింద పడ్డారని, వెనుక ఉన్న మహిళలు ఒక్కసారిగా తోసుకుని ముందుకు రావడంతో ఈ తొక్కిసలాట సంభవించిందని ఆయన తెలిపారు.
 
తాము సరిపడినంత బందోబస్తు ఇచ్చామని, బారికేడ్లు విరిగిపడటంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. పైగా, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తాము ట్రస్ట్ నిర్వాహకులకు చెప్పామన్నారు. ముఖ్యంగా, చంద్రన్న కానుకల పంపిణీపై నిర్వాహకులు గత కొన్ని రోజులుగా ప్రచారం చేయడంతో ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారని చెప్పారు. 
 
చంద్రన్న కానుకల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి మహిళలు క్యూలైన్లలో ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో ఓ కౌంటర్ వద్ద బారికేడ్ విరిగిపోవడంతో క్యూలైన్‌లో ఉన్న మహిళలు ముందుకుపడిపోగా వెనుక ఉన్నవారు ఒక్కసారిగా వారిపై పడటంతో ఓ మహిళ ఊపిరాకడ అక్కడికక్కడే మృతి చెందినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని ఎస్పీ వెల్లడించారు.