శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (17:54 IST)

మా కుటుంబానికి - పార్టీకి కష్టకాలం.. ప్రజలంతా అండగా ఉండాలి : నారా భువనేశ్వరి

bhuvaneswari
ప్రస్తుతం తమ కుటుంబంతో పాటు తెలుగుదేశం పార్టీకి కష్టకాలం వచ్చిందని, అందువల్ల తెలుగు ప్రజలంతా అండగా ఉండాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్న తన భర్తను నారా భువనేశ్వరి, ఆయన కుమారుడు నారా లోకేశ్, కోడలి నారా బ్రహ్మణిలు మంగళవారం కలుసుకున్నారు. ఈ ములాఖత్ దాదాపు 45 నిమిషాల పాటు జరిగింది.
 
ఆ తర్వాత భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ... ఆయన ఉదయం నుండి రాత్రి వరకు నిత్యం ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి అన్నారు. తాను ఎప్పుడైనా అడిగితే.. తనకు ప్రజలే ముఖ్యమని, ఆ తర్వాతే కుటుంబమని చెప్పేవారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని ఆయన నిర్మించిన భవనంలోనే ఆయనను కట్టిపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఏమీ లేని కేసులో ఇరికించి చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ప్రజల కోసం పని చేస్తోందని ఆ కుటుంబ సభ్యురాలిగా తాను హామీ ఇస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆయన జైల్లోనూ ప్రజల కోసమే ఆలోచిస్తున్నారన్నారు. దేశంలోనే ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలనేది చంద్రబాబు కోరిక అన్నారు.
bhuvaneswari family
 
తాను ఆరోగ్యంగానే ఉన్నానని, బాగున్నానని, భయపడవద్దని తనకు ధైర్యం చెప్పారన్నారు. జైల్లో అన్ని సౌకర్యాలు ఉన్నట్లుగా కనిపించడం లేదన్నారు. చన్నీళ్లతో స్నానం చేయవలసి వస్తోందన్నారు. ఇది తమ కుటుంబానికి, పార్టీకి కష్ట సమయమని, ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఆయన సెక్యూరిటీ గురించే తన భయమన్నారు. టీడీపీ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అని, ఏమీ కాదన్నారు. తమ కుటుంబం ఎప్పుడూ ప్రజలు, క్యాడర్ కోసం నిలుస్తుందన్నారు. 
 
మరోవైపు, ఈ ములాఖత్‌కు చంద్రబాబు కుటుంబం నుంచి కేవలం ముగ్గురుని మాత్రమే జైలు అధికారులు అనుమతిచ్చారు. వారిలో భార్య, కుమారుడు, కోడలు మాత్రమే ఉన్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్‌లు జైలుకు వచ్చినప్పటికీ వారికి ములాఖత్‌కు అనుమతి లేకపోవడంతో వారు జైలు బయటే ఉండిపోయారు. మరోవైపు, రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీ స్థాయిలో భద్రతను కల్పించారు.