శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (19:09 IST)

వైకాపాకు షాకిచ్చిన రెబెల్ ఎమ్మెల్యేలు.. టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం

anuradha
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైకాపాకు దిమ్మతిరిగిపోయింది. ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తేరుకోలేని షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పంచుమర్తి అనురాధకు వారు క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో ఆమెకు 23 ఓట్లు పోలయ్యాయి. ఫలితంగా ఆమె ఘన విజయం సాధించారు. 
 
టీడీపీకి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు వైకాపా పంచన చేశారు. మిగిలిన 19 ఎమ్మెల్యేల బలంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ తరపున అనురాధను అభ్యర్థిగా బరిలోకి దించారు. ఆమెకు టీడీపీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలతో పాటు నెల్లూరు జిల్లాకు వైకాపా రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో పాటు వైకాపాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అనురాధకు క్రాస్ ఓటింగ్ వేశారు. 
 
ఫలితంగా ఆమె అనూహ్యంగా గెలుపొందారు. అయితే, టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేసిన ఆ ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు ఎవరన్నదానిపై ఇపుడు సర్వత్రా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. మరోవైపు అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.