1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఏపీలో పార్టీ పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా? వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తన పార్టీని స్థాపించే దిశగా ఆమె అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఆమె స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా అని ప్రశ్నించారు. 
 
ఆమె సోమవారం ఆ మీడియా ప్రతినిధితో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, ఒక రాజకీయ పార్టీని దేశంలో ఎక్కడైనా పెట్టొచ్చన్నారు. పైగా, తమంటూ ఒక విధానం, మార్గం ఉందన్నారు. అందువల్ల ఆ మార్గంలోనే తాము ప్రయాణిస్తున్నామని చెప్పారు. 
 
ఇదిలావుంటే, ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం పొసగడం లేదని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, క్రిస్మస్ పండుగ రోజున తమ తండ్రి వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా వీరిద్దరూ గొడవపడినట్టు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. 
 
ముఖ్యంగా, ఆస్తుల పంపకాల విషయంలో తల్లి విజయమ్మ సమక్షంలోనే వారిద్దరూ గొడవపడినట్టు సమాచారం. ఆ తర్వాత అర్థరాత్రి సమయంలో తన తల్లి విజయమ్మతో కలిసి ఇడుపులపాయ నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి.