ఇంటర్ విద్యా విధానంలో సమూల మార్పులు... బైపీసీ విద్యార్థులకు గణితం
ఏపీ ప్రభుత్వం ఇంటర్ విద్యా విధానంలో సమూల మార్పులు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త పాఠ్య విధానం అమల్లోకి తీసుకొచ్చారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునేందుకు వీలుగా విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఈ మార్పులతో ఇంజనీరింగ్, మెడిసిన్ రంగాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు రెండు విభాగాల సబ్జెక్టులను ఒకేసారి చదివే అరుదైన అవకాశం లభించింది.
ఇప్పటివరకు ఎంపీసీ విద్యార్థులు గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు మాత్రమే చదవాల్సి వచ్చేది. అలాగే బైపీసీ విద్యార్థులకు జీవశాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలు తప్పనిసరి. కానీ, తాజా సంస్కరణలతో ఈ నిబంధనలు తొలగిపోయాయి. ద్వితీయ భాష స్థానంలో 'ఎలక్టివ్ సబ్జెక్టు' విధానాన్ని తీసుకురావడంతో విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న 24 సబ్జెక్టుల నుంచి దేన్నైనా ఎంచుకోవచ్చు. దీని ఫలితంగా ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితాన్ని ఎంచుకునే వెసులుబాటు కలిగింది.
ఈ కొత్త విధానం కింద రాష్ట్రవ్యాప్తంగా 11,257 మంది విద్యార్థులు ఎంబైపీసీ వైపు మొగ్గు చూపారు. వీరిలో కొందరు ఎలక్టివ్ సబ్జెక్టుగా ఎంచుకోగా, మరికొందరు అదనపు సబ్జెక్టుగా తీసుకున్నారు. ముఖ్యంగా 7,400 మంది బైపీసీ విద్యార్థులు గణితాన్ని, 3,613 మంది ఎంపీసీ విద్యార్థులు బయాలజీని అదనపు సబ్జెక్టుగా స్వీకరించారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్లో 5,40,924 మంది ప్రవేశాలు పొందారు.
సబ్జెక్టుల ఎంపికలోనే కాకుండా, కోర్సుల నిర్మాణంలోనూ ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేసింది. ఎంపీసీలో ఎ, బి లుగా ఉన్న గణితాన్ని ఒకే సబ్జెక్టుగా, బైపీసీలో బోటనీ, జువాలజీని కలిపి బయాలజీగా మార్చింది. దీంతో ఇకపై అన్ని గ్రూపుల్లోనూ ఐదు సబ్జెక్టుల విధానమే అమల్లోకి వచ్చింది.
అలాగే, కొత్త విధానం వల్ల పరీక్షల షెడ్యూల్లోనూ మార్పులు రానున్నాయి. గతంలో గణితం, జీవశాస్త్రం పరీక్షలు ఒకేరోజు జరిగేవి. ఇప్పుడు ఎంబైపీసీ విద్యార్థులకు ఇది సాధ్యం కాదు కాబట్టి, రోజుకు ఒక సబ్జెక్టు చొప్పున పరీక్షలు నిర్వహించాలని బోర్డు యోచిస్తోంది. దీనివల్ల పరీక్షలు ఎక్కువ రోజులు జరిగే అవకాశం ఉన్నందన పబ్లిక్ పరీక్షలను ముందుగానే నిర్వహించనున్నారు.