గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 మార్చి 2020 (16:21 IST)

అంతా భారత బౌలింగ్ మాయ.. అలీసా అదుర్స్... 2వేల పరుగులతో రికార్డ్

Alyssa Healy
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌‌లో భాగంగా భారత్‌ బౌలర్లు రాణించలేకపోయారు. దీన్ని క్యాష్ చేసుకున్న ఆస్ట్రేలియా వుమెన్ టీమ్.. అదరగొట్టే స్కోరు చేశారు. ఈ క్రమంలో ఆ జట్టు ఓపెనర్ అలీసా హిలీ వరుస బౌండరీలతో భారత బౌలర్లపై విరుచుకుపడుతూ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తొలి ఓవర్లోనే రెండు బౌండరీలు బాదిన అలీసాకు ఇండియన్ అమ్మాయిల చెత్త ఫీల్డింగ్‌తో లైఫ్ లభించింది.
 
ఫార్వార్డ్‌లో అలీసా ఇచ్చిన సునాయస క్యాచ్‌ను యువ సంచలనం షెఫాలీ వర్మ విడిచి పెట్టింది. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్న అలీసా రెండో ఓవర్‌లో రెండో బంతిని బౌండరీకి తరలించి అంతర్జాతీయ మహిళల టీ20ల్లో 2000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆసీస్ బ్యాటర్‌గా రికార్డు సొంతం చేసుకుంది.
 
కాగా మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్ పోరులో ఆసీస్ 85 పరుగుల తేడాతో టీమిండియా మహిళల జట్టుపై విజయభేరి మోగించింది. 185 పరుగుల లక్ష్యం అందుకునే క్రమంలో భారత్ అమ్మాయిలు 99 పరుగులకే ఆలౌటయ్యారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 19.1 ఓవర్ల వద్ద తన ప్రస్థానం ముగించింది. మిడిలార్డర్ లో దీప్తి శర్మ చేసిన 33 పరుగులే జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు. స్టార్లుగా భావించిన అందరూ దారుణంగా విఫలమయ్యారు. 
 
దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి (19), రిచా ఘోష్ (18) ఓ మోస్తరు పోరాటం కనబర్చడంతో భారత్ ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో మేఘాన్ షట్ 4, జొనాస్సెన్ 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలవడం ద్వారా ఆతిథ్య ఆస్ట్రేలియా సగం మ్యాచ్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.