శుక్రవారం, 5 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (10:46 IST)

ఆసియా కప్ : శివాలెత్తిన పాకిస్థాన్.. నేపాల్‌పై 238 రన్స్ తేడాతో గెలుపు

pakistan team
ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా పాకిస్థాన్ నేపాల్ జట్ల మధ్య బుధవారం తొలి మ్యాచ్ జరిగింది. ఇందులో పాక్ కుర్రోళ్లు శివాలెత్తిపోయారు. ఫలితంగా క్రికెట్ పసికూన నేపాల్ జట్టుపై 238 పరుగుల తేడాతో విజయభేరీ మోగించారు. ఇది పాకిస్థాన్ జట్టు చరిత్రలో మూడో అతిపెద్ద విజయం. 
 
ఈ మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం (151), ఇప్తికార్ అహ్మద్ (109) సెంచరీలతో విధ్వంసం సృష్టించడంతో తొలిసారి ఆసియాకప్ ఆడుతున్న పసికూన నేపాల్ విలవిల్లాడిపోయింది. పాక్ బ్యాటర్లపై నేపాల్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
 
అనంతరం 343 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నేపాల్ 23.4 ఓవర్లలో 104 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. జట్టులో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్ కాగా, ఐదుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. 
 
ఆరిఫ్ షేక్ 26, సోంపాల్ కామి 28, గుల్సన్ ఝా 13 పరుగులు చేశారు. వీరిద్దరు మాత్రమే చెప్పుకోదగిన విధంగా రెండంకెల స్కోరు చేశారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4, షహీన్ అఫ్రిది, హరీశ్ రవూఫ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కెప్టెన్ బాబర్ ఆజంకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.