1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 29 ఫిబ్రవరి 2024 (16:27 IST)

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో ఏం జరుగుతోంది తెలియాలనే బహిర్గతం చేశా : హనుమ విహారి

hanuma vihari
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో ఏం జరుగుతుందో తెలియాలనే అన్ని విషయాలను బహిర్గతం చేసినట్టు భారత క్రికెటర్ హనుమ విహారి వెల్లడించారు. రంజీ ట్రోఫీ సందర్భంగా ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంపై ఇటీవల సంచలన విషయాలను వెల్లడించిన విషయం తెల్సిందే. దీంతో హనుమ విహారి ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. 
 
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అధికార పార్టీ కార్పొరేటర్‌ కుమారుడిని వారించినందుకే తనను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించారని.. ఇంకెప్పుడూ ఆంధ్రా జట్టుకు ఆడేది లేదని అప్పట్లో హనుమ విహారి పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కూడా విహారిని ఉద్దేశించి విమర్శలు గుప్పించింది. అయితే, తాను అసభ్య పదజాలం వాడలేదని విహారి స్పష్టం చేశాడు. 
 
'నేను ఒక ఆటగాడిపై అసభ్య పదజాలంతో అరిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కానీ, 17వ ప్లేయర్‌గా ఉన్న అతడు నిబంధనల ప్రకారం..  మ్యాచ్‌ సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి రాకూడదు. అదే విషయంపై అతడిని వారించా. కానీ, సదరు ప్లేయర్‌ మాత్రం దానిని తప్పుగా చిత్రీకరించాడు. తన తండ్రికి ఫిర్యాదు చేయడంతో.. ఘటన మొత్తం నెగిటివ్‌గా మారిపోయింది. నేనేమీ తప్పు చేయకపోయినా నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. అయినా, మొన్నటివరకు జట్టు కోసం ఆడేందుకు కొనసాగా. ఆటపట్ల నాకున్న ప్రేమ అలాంటిది. దానికి గౌరవం ఇస్తా. 
 
రంజీ టోర్నీలో ఆంధ్రా జట్టు తరపున ఆడటం ముగిసిన తర్వాత నేనే సోషల్‌మీడియాలో పోస్టు పెట్టా. ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉంది. అసలేం జరిగిందో తెలియాలి. గత నెలలో ఈ ఘటన జరిగింది. కానీ, ఇన్నాళ్లూ నా మనసులోనే దాచుకున్నా. కొన్నేళ్లుగా రాష్ట్ర, జాతీయ జట్టుకు ఆడుతున్న ఆటగాడిని. ఇది నాకు చాలా కష్టంగా అనిపించింది. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. అప్పుడు మాత్రం టోర్నమెంట్, జట్టు కోసం బయటకు చెప్పలేకపోయా. ఇప్పుడు నాకోసం నిలబడాలని కోరుకున్నా. లేకుంటే నన్ను నేను క్షమించుకోలేను' అని హనుమ విహారి వ్యాఖ్యానించాడు.