శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (09:22 IST)

ఐపీఎల్ 2022 : లక్నో ఖాతాలో హ్యాట్రిక్ విజయం

luckonw team
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2022 టోర్నీలో భాగంగా, గురువారం రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు విజయం సాధించింది. ఈ గెలుపుతో లక్నో జట్టు హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ క్రికెట్ పండితుల అంచనాలకు మించి రాణిస్తుంది. ఫలితంగా ముచ్చటగా మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఉత్కంఠ భరితంగా ఆరు వికెట్లతో గెలిచింది. తొలుత ఢిల్లీ జట్టును లక్నో బౌలర్లు కట్టడి చేశారు. ఆ తర్వాత జట్టు ఆటగాడు డీకాక్ బ్యాట్‌తో రాణించాడు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్  చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులు సాధించింది. ఓపెనర్ పృథ్వీ షా 34 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. అలాగే రిషబ్ పంత్ (39), సర్ఫరాజ్ (36) చొప్పున పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. 
 
నిజానికి చేతిలో వికెట్లు ఉన్నప్పటికీ ఢిల్లీ ఆటగాళ్లు బ్యాట్‌ను ఝుళిపించలేకపోయారు. దీనికితోడు లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 150 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టులో రాహుల్ 24, డికాక్ 80, లూయిస్ 5, హుడా 11, క్రునాల్ 19, బదోని 10 చొప్పున పరుగులు చేయగా, మరో పది పరుగులు అదనంగా వచ్చాయి. దీంతో లక్నో జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.