1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (13:27 IST)

Hitman@264.. నేటితో ఏడేళ్లు పూర్తి... 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లు

టీమిండియా బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ వన్డే ఆటగాళ్ల జాబితా తీస్తే ముందువరుసలో ఉంటాడు. క్రికెట్‌ చరిత్రలో తనకంటే పలువురు గొప్ప బ్యాట్స్‌మెన్‌గా ఎదిగినా.. వాళ్లెవరికీ సాధ్యంకాని రికార్డును తన పేరిట వేసుకున్నాడు. 
 
వన్డే క్రికెట్‌లో ఎంత పెద్ద బ్యాట్స్‌మన్‌కైనా ద్విశతకం జీవితకాల కలగానే ఉంటుంది. అలాంటిది ఈ హిట్‌మ్యాన్‌ నాలుగేళ్లలో మూడుసార్లు సాధించి క్రికెట్‌ ప్రపంచాన్ని ఔరా అనిపించాడు. అందులోనూ శ్రీలంకపై ఏకంగా 264 పరుగులు సాధించి.. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు సాధించి నేటికి (నవంబర్ 13) ఏడేళ్లు పూర్తయ్యాయి.  
 
వన్డేల్లో ఎంత గొప్ప బ్యాట్స్‌మన్‌కైనా ఒక జట్టుపై ఒకసారి ద్విశతకం బాదాలంటేనే ఊహకందని విషయం. అలాంటిది రోహిత్‌ 'సూపర్‌హిట్‌'గా మారి శ్రీలంకపై రెండుసార్లు దండయాత్ర చేశాడు. ఆస్ట్రేలియాపై అద్వితీయ ఇన్నింగ్స్‌(209 పరుగులు, 2013లో) ఆడిన మరుసటి సంవత్సరమే మరో మరుపురాని ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇది వన్డే క్రికెట్‌ చరిత్రలో 2014 నవంబరు 14న ఈడెన్​ గార్డెన్స్​లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో బౌండరీల వరద పారింది. 
 
బంతి ఏదైనా స్టాండ్స్​లోకే వెళ్లింది. రోహిత్.. 173 బంతుల్లో 264 పరుగులతో విజృంభించాడు. 33 ఫోర్లు, 9 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే శ్రీలంక అతడిని ఔట్ చేసే అవకాశాన్ని వదులుకుని భారీ మూల్యం చెల్లించుకుంది. 
 
అయితే ఈ మ్యాచ్​కు ముందు రోహిత్​ గాయం కారణంగా మూడు నెలలపాటు క్రికెట్ ఆడకపోవడం గమనార్హం. రోహిత్.. తన కెరీర్​లో తొలి డబుల్ సెంచరీని(209) 2013లో ఆస్ట్రేలియాపై చేశాడు. 2017లో లంకేయులపై 208 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రెండోసారి, మూడోసారి శ్రీలంకపైనే ఈ ఘనత సాధించడం విశేషం.