ఇండో-పాక్ క్రికెట్ సిరీస్ పాకిస్థాన్లోనే జరగాలి: జహీర్ అబ్బాస్
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ సిరీస్కు పాకిస్థానే వేదిక కావాలని పాకిస్థాన్ మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ జహీర్ అబ్బాస్ ఆశిస్తున్నారు. సిరీస్ జరపాలనుకుంటున్న యూఏఈ తమ దేశం కాదని... తమ క్రికెట్ హీరోల ఆటను సొంత దేశంలోనే చూడాలని పాకిస్థానీలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పూర్తి స్థాయిలో క్రికెట్ సిరీస్ 2007లో జరిగింది. అప్పుడు మూడు టెస్టులు, ఐదు వన్డేలు జరిగాయి. ఆ తర్వాత 2012-13లో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు ఉన్న సమయంలో ఇండియాలో పాక్ మూడు వన్డేలు ఆడింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన దశలో, పాక్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా చేతులెత్తేసింది. ఇండో-పాక్ సిరీస్కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
డిసెంబర్లో జరగబోతున్న ఈ సిరీస్కు... యూఏఈ ఆతిథ్యమిస్తుంది. అయితే, ఈ సిరీస్ ఇండియాలో జరగాలని, అందులోనూ తొలి టెస్టు కోల్ కతాలో జరగాలని బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా ఆశిస్తున్నారు.