మంగళవారం, 22 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 అక్టోబరు 2024 (18:29 IST)

చాంపియన్స్ ట్రోఫీ టీమిండియా డుమ్మా? దిక్కుతోచనిస్థితిలో పీసీబీ!!

champion trophy
వచ్చే యేడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ మెగా ఈవెంట్‌లో భారత క్రికెట్ జట్టు పాల్గొనేలా చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఇందుకోసం అనేక రకాలైన మార్గాలను అన్వేషిస్తుంది. ఈ టోర్నీకి టీమిండియా గైర్హాజరైన పక్షంలో పీసీబీ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోనుంది. దీంతో భారత్ క్రికెట్ జట్టు పాల్గొనేలా అనేక విధాలుగా ఒత్తిడి తెస్తుంది. అయితే, పీసీబీ ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చినా పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టేందుకు టీమిండియా ఏమాత్రం సుముఖంగా లేదు. 
 
ఈ నేపథ్యంలో భారత జట్టు పాక్‌కి వెళ్లడానికి కచ్చితంగా నిరాకరిస్తుందనే ఉద్దేశంతోనే పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మార్చి 9వ తేదీన జరిగే ఫైనల్స్‌కి భారత క్రికెట్ జట్టు అర్హత సాధించినా లాహోర్‌లో తప్ప మరెక్కడా మ్యాచ్‌ని జరపడానికి పీసీబీ ఇష్టపడట్లేదని తెలుస్తోంది. 
 
'ఛాంపియన్స్‌ ట్రోఫీని మొత్తం పాక్‌లోనే నిర్వహించాలనేదే పీసీబీ మొదటి ప్రాధాన్యం. అయితే టీమిండియా పాక్‌ పర్యటనకి రావడానికి భారత ప్రభుత్వం నిరాకరిస్తుందని, యూఏఈలో ఈ మ్యాచ్‌లని జరపాలని కోరుతుందని పీసీబీ మానసికంగా సిద్ధమైంది. భారత జట్టు టోర్నమెంట్‌లో పాల్గొన్నా, పాల్గొనకపోయినా ఫైనల్‌ మ్యాచ్‌ని లాహోర్‌లో గడాఫీ స్టేడియంలోనే నిర్వహించాలని పీసీబీ నిర్ణయించింది. ఇప్పటికే రూపొందించిన షెడ్యూల్ ప్రకారం, కరాచీ, రావల్పిండి, లాహోర్‌ స్టేడియాలను పునరుద్ధరిస్తున్నారు. 
 
దాని కోసం కేటాయించిన సుమారు ఏడు బిలియన్ల అత్యధిక బడ్జెట్‌ సహా వివరాలన్నీ పీసీబీ ఛైర్మన్‌ నఖ్వీ సమర్పించనున్నారు' అని పీసీబీ వర్గాలు తెలిపాయి.ఇదిలా ఉండగా, ఈ టోర్నీలో ఫైనల్‌తో సహా ఏడు మ్యాచ్‌లకు లాహోర్ ఆతిథ్యం ఇవ్వనుంది. తొలి మ్యాచ్‌, సెమీ-ఫైనల్‌ను కరాచీలో నిర్వహిస్తుండగా, మరో సెమీ-ఫైనల్‌తో సహా ఐదు మ్యాచ్‌లకు రావల్పిండి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తల కారణంగా భారత జట్టు చాలాకాలంగా పాక్‌ పర్యటనకు వెళ్లట్లేదు.