ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

విరాట్ కోహ్లీ మా దేశంలో క్రికెట్ ఆడాలి : యూనిస్ ఖాన్

younis khan
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తమ దేశంలో క్రికెట్ ఆడాలని పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు తమ దేశంలో పర్యటించాలని, భద్రతా కారణాలను బూచిగా చూపించరాదని కోరారు. ఐసీసీ నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ, విరాట్ కోహ్లీ కెరియర్‌లో పాక్ పర్యటన ఓ లోటుగా మిగిలిపోయిందన్నారు. అతడొచ్చి పాకిస్థాన్‌లో ఆడితో చూడాలని ఉందన్నారు. అది తమ కోరిక కూడా అని తెలిపారు. 
 
2025 చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ కోసం విరాట్ కోహ్లీ తమ దేశానికి రావాలి. అది మా కోరిక కూడా. అతడొచ్చి పాకిస్థాన్‌లో ఆడాలి. కోహ్లీ కెరియర్‌లో పాకిస్థాన్ టూర్ లేకుండా పోయింది. అందువల్ల ఈ ట్రోఫీ కోసం అతడొచ్చి ఇక్కడ ఆడాలి అని యూనిస్ ఖాన్ పేర్కొన్నాడు. కోహ్లీ గత 2008లో అంతర్జాతీయ క్రికెట్‌ను ప్రారంభించారు. 2006లో పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో భారత్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌ను ఆడింది. ఆ తర్వాత భారత క్రికెట్ జట్టు ఎన్నడూ పాకిస్థాన్‌లో పర్యటించలేదు. 
 
ఈ నేపథ్యంలో వచ్చే పాకిస్థాన్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తోంది. భారత జట్టు ఈ టోర్నీలో పాల్గొనే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. దాయాది దేశం వెళ్లేందుకు భారత జట్టుకు ప్రభుత్వం అనుమతిచ్చే అవకాశాలు దాదాపు లేవు. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో అనుసరించిన హైబ్రిడ్ విధానాన్నే చాంపియన్స్ ట్రోఫీలోనూ అనుసరించాలని బీసీసీఐ ప్రతిపాదిస్తున్న సంగతి విదితమే!