1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2015 (14:36 IST)

సచిన్ గ్రామంలో అధికారులు: ఇక్కడ శుభ్రం చేయరా? స్థానికులకు ప్రశ్న

క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ గ్రామంలో అధికారులు పర్యటించారు. ఈ నెల 23న జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు కోసం ఆదర్శ గ్రామాల అభివృద్ధి చిత్ర సమర్పణ జరుగనుంది. ఇందులో భాగంగా సచిన్ దత్తత తీసుకున్న గ్రామాన్ని టెండూల్కర్ సిబ్బంది, అధికారులు నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పుట్టంరాజువారి కండ్రిగలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పర్యవేక్షించారు. 
 
ఈ సందర్భంగా అధికారులు అభివృద్ధి పనులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ముందస్తు సమాచారం లేకుండా సచిన్ సిబ్బంది బృందం దిగబడ్డారు. దీంతో స్థానికులు తలపట్టుకున్నారు. వచ్చీరాగానే స్థానికులను ప్రశ్నలు మీద ప్రశ్నలేశారు. శుభ్రత లేదంటూ మండిపడ్డారు. గ్రామంలోని సిమెంట్ దారులను చూసి ఆశ్చర్యపోయిన అధికారులు అపరిశుభ్రంగా ఉండటంతో ఇక్కడ శుభ్రం చేయరా? అంటూ స్థానికులను ప్రశ్నించారు. 
 
ఇంకా గ్రామంలో జరుగుతున్న నిర్మాణ పనులపై ఆరా తీశారు. కాగా సచిన్ ఎంపీ నిధులతో ఈ గ్రామంలో క్రీడా మైదానం, అంగన్ వాడీ భవనం, భోజనశాల, గ్రామచెరువు ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వాటిని పరిశీలించిన అధికారులు ఫోటోలు తీసుకున్నారు.