శనివారం, 7 మార్చి 2026
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2026 (16:53 IST)

వరుస వైఫల్యాలు.. అభిషేక్ శర్మకు ఫైనల్‌లో అవకాశం లభించేనా?

abhishek sharma
భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో వరుసగా వైఫల్యం చెందారు. ఈ టోర్నీలో మొత్తం ఏడు మ్యాచ్‌లలో ఓపెనర్‌గా దిగిన అభిషేక్.. ఒక్క జింబాబ్వే జట్టుపై మినహా మిగిలిన జట్లపై రెండు అంకెల స్కోరుకే వెనుదిరిగాడు. దీంతో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్‌కు అవకాశం లభిస్తుందా లేదా అన్న సందేహం ఇపుడు నెలకొంది. 
 
అత్యంత కీలకమై ఫైనల్ మ్యాచ్‌‍ కోసం జట్టు కూర్పుపై చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానంపై తీవ్ర చర్చ నడుస్తోంది. టోర్నీ ఆసాంతం అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, ఫైనల్ కోసం అతన్ని కొనసాగించాలా? లేక డేరింగ్ నిర్ణయం తీసుకొని ఫినిషర్ రింకూ సింగ్‌ను జట్టులోకి తీసుకోవాలా? అనే ప్రశ్న ఇప్పుడు అభిమానులను, విశ్లేషకులను తొలుస్తోంది.
 
ఈ టోర్నీలో అభిషేక్ గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో అతను కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో జింబాబ్వేపై చేసిన ఒక అర్థసెంచరీ (55) మినహా.. మిగతా మ్యాచ్‌లలో 0, 0, 0, 15, 10, 9 స్కోర్లకే పరిమితమయ్యాడు. అతని సగటు కేవలం 12.71 మాత్రమే ఉండటం గమనార్హం. దీంతో కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో ఇలాంటి ఫామ్‌‍లేని ఆటగాడిని నమ్ముకోవడం రిస్క్ అవుతుందని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
 
'నిలకడగా విఫలమవుతున్న ఆటగాడితో ఫైనల్ మ్యాచ్‌లో ప్రయోగం చేయకూడదు. రింకూ సింగ్ వంటి మ్యాచ్ విన్నర్‌ను తీసుకోవాలి' అని ఒక అభిమాని కామెంట్ చేయగా, 'అభిషేక్ ఆటతీరును ప్రత్యర్థులు పసిగట్టారు, కివీస్ బౌలర్లు అతన్ని సులభంగా కట్టడి చేస్తారు' అని మరొకరు విశ్లేషించారు. 
 
ప్రస్తుతం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ ముందు పెద్ద సవాల్ ఉంది. విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగిస్తారా? లేక ట్రోఫీ కోసం కఠిన నిర్ణయం తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. దాదాపుగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తున్నా, ఫైనల్ ఒత్తిడి దృష్ట్యా రింకూ సింగ్ పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదు.