1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (16:40 IST)

ముంబై టెస్టు.. కష్టాల్లో టీమిండియా.. విరాట్ కోహ్లీ డకౌట్‌పై రచ్చ రచ్చ

Kohli
న్యూజిలాండ్‌తో ముంబైలో జరుగుతున్న టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నిర్ణయానికి తగ్గట్టుగానే ఓపెనర్లు తొలి వికెట్ కు 80 పరుగులు జోడించి శుభారంభం అందించారు.
 
కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒక్కసారిగా ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు. తొలుత ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (44)ను అవుట్ చేసిన అజాజ్ పటేల్... తన తదుపరి ఓవర్లో ఏకంగా చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీలను అవుట్ చేసి టీమిండియాను దెబ్బతీశాడు. పుజారా, కోహ్లీ కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండానే నిష్క్రమించారు. దాంతో భారత్ 80 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది.
 
ఇకపోతే.. విరాట్ కోహ్లీ డకౌట్ ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఈ రెండో టెస్ట్‌లో థర్డ్ అంపైర్ ఘోర తప్పిదానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బలయ్యాడు. లాంగ్ బ్రేక్ అనంతరం మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన కోహ్లీ.. చేయని తప్పుకు డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. 
 
చతేశ్వర్ పుజారా ఔటైన అనంతరం ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన కోహ్లీకి.. అంపైర్ల రూపంలో బిగ్ షాక్ తగిలింది. ఎల్బీ డబ్ల్యూ విషయంలో ఫీల్డ్ అంపైర్ ఔటివ్వగా.. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విరాట్ కోహ్లీ సమీక్ష కోరాడు.
 
ఇక థర్డ్ అంపైర్ పలుకోణాల్లో పరీక్షించి కోహ్లీ ఔటవ్వలేదనడానికి కావాల్సిన సాక్ష్యం లేదని చెబుతూ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థించాడు. ఇక ఈ నిర్ణయంతో కోహ్లీతో పాటు మైదానంలో ఉన్న అభిమానులు, ఇతర ఆటగాళ్లంతా అవాక్కయ్యారు. 
 
కోహ్లీ అయితే అంపైర్‌తో వాదించాడు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోని కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు ఇతర ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ సైతం ఈ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.