1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 2 జులై 2024 (11:16 IST)

భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రాణా అరుదైన రికార్డు!

sneh rana
భారత మహిళా క్రికెట్ జట్టు బౌలర్ స్నేహ్ రాణా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఒకే మ్యాచ్‌‍లో ఏకంగా 10 వికెట్లు తీసి సరికొత్త రికార్డును నమోదు చేశారు. చెన్నైలోని చెపాక్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 603 పరుగుల భారీ స్కోర్ చేయగా.. సౌతాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 266 పరుగులకే కుప్పకూలింది. 
 
దీంతో ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ మొదలెట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో 373 రన్స్‌కు ఆలౌటైంది. భారత్ ముందు 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్ భారత వికెట్లేమీ కోల్పోకుండా 9.2 ఓవర్లలోనే ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ స్నేహ్ రాణా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఒకే మ్యాచ్ 10 వికెట్లు పడగొట్టిన రెండో ఇండియన్ బౌలర్గా చరిత్ర సృష్టించింది. 
 
తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను కుప్పకూల్చిన స్నేహ్ రాణా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలకమైన రెండు వికెట్లు తీసింది. ఓవరాల్‌గా ఆమె 10 వికెట్లు తీసింది. ఆమె కంటే ముందు ఈ జాబితాలో మహిళ క్రికెట్ దిగ్గజం జులాన్ గోస్వామి ఉంది. 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచులో ఆమె 10 వికెట్లు పడగొట్టింది. అయితే, ఈ ఫీట్ సాధించిన తొలి మహిళా స్పిన్నర్ మాత్రం స్నేహ్ రాణానే కావడం గమనార్హం.