శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 16 జూన్ 2019 (16:08 IST)

వరల్డ్ కప్ 2019 : రోహిత్ అర్థశతకం... భారత్ దూకుడు

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం ఎట్టకేలకు భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య కీలక మ్యాచ్ ప్రారంభమైంది. మాంచెష్టర్‌లోని ఓల్డ్‌ట్రాఫోర్డ్‌ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేపట్టాల్సి వచ్చింది. 
 
ఫలితంగా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు క్రీజ్‌లోకి వచ్చి పాకిస్థాన్ పేస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అర్థ సెంచరీ (57 నాటౌట్) పూర్తి చేయగా, కేఎల్ రాహుల్ 32 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 16 ఓవర్లలో 93 పరుగులు చేసింది.
 
ఈ దాయాదుల పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొనగా, ఎట్టకేలకు టాస్ వేయగా, టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో బౌలింగ్ ఎంచుకున్నామని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపాడు. 
 
అయితే, ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న మాంచెస్టర్‌లో ఉదయం నుంచి వర్షం అడపాదడపా కురుస్తుండడం కాస్తంత ఆందోళన కలిగిస్తోంది. కాగా, టీమిండియాలో ఒక మార్పు చోటుచేసుకుంది. గాయపడిన శిఖర్ ధావన్ స్థానంలో ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌కు స్థానం కల్పించారు. ఇప్పటివరకు పెద్దగా అంతర్జాతీయ అనుభవంలేని విజయ్ శంకర్ ఏకంగా పాకిస్థాన్‌తో మ్యాచ్ ద్వారా వరల్డ్ కప్ అరంగేట్రం చేయనుండటం విశేషం అని చెప్పాలి. ఇక పాక్ జట్టులో షాదాబ్ ఖాన్, ఇమాద్ వాసింలకు చోటు కల్పించారు. 
 
ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే,
 
భారత్ : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కోహ్లీ, విజయ్ శంకర్, జాదవ్, ధోనీ, పాండ్యా, కుమార్, కుల్దీప్ యాదవ్, చాహల్, బుమ్రా.
పాకిస్థాన్ : ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజమ్, హఫీజ్, సర్ఫాజ్ అహ్మద్, షోయబ్ మాలిక్, ఇమద్ వాసీం, షదాద్ ఖాన్, హసన్ అలీ, మహ్మద్ అమిర్.