గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 16 జూన్ 2019 (18:42 IST)

విరాట్ కోహ్లీ రికార్డు : మాంచెష్టర్ మ్యాచ్‌కు అడ్డుపడిన వరుణుడు

ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న హైవోల్టేజ్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగతంగా వన్డే కెరీర్‌లో 11 వేల పరుగుల మైలురాయిని అధికమించాడు. ముఖ్యంగా, అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా మూడో బ్యాట్స్‌మెన్. 
 
పాక్‌తో మ్యాచ్‌లో వ్య‌క్తిగ‌త స్కోరు 57 ప‌రుగులు పూర్తి చేయ‌డంతో ఈ ఘ‌న‌త అందుకున్నాడు. విరాట్ కోహ్లీ 222 ఇన్నింగ్స్‌లలో 11 వేల పరుగులు పూర్తియగా, 276 ఇన్నింగ్స్‌లో స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉన్న రికార్డును తాజాగా కోహ్లీ అధిగ‌మించాడు. గతంలో ఈ తరహా రికార్డు సచిన్ టెండూల్కర్ (276 ఇన్నింగ్స్), రికీ పాంటింగ్ (286 ఇన్నింగ్స్), సౌరభ్ గంగూలీ (288 ఇన్నింగ్స్), జాక్వెస్ కలీస్ (293 ఇన్నింగ్స్)ల పేరిట ఉంది. 
 
అలాగే, ఓపెనర్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 140 పరుగులు చేశాడు. పాకిస్థాన్‌పై ప్రపంచకప్‌లో ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2003లో ఆసీస్ ఆటగాడు ఆండ్రూ సిమండ్స్ అజేయంగా 143 పరుగులు చేశాడు. పాక్‌పై ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, 2011 ప్రపంచకప్‌లో రాస్ టేలర్ అజేయంగా 131 పరుగులు చేశాడు. పాకిస్థాన్‌పై ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇప్పుడు అతడిని రోహిత్ వెనక్కి నెట్టేసి రెండో స్థానాన్ని ఆక్రమించాడు.
 
ఇదిలావుంటే, అంతా సాఫీగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో మాంచెష్టర్ మ్యాచ్‌కు వరుణు అడ్డుపడ్డాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ముఖ్యంగా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేశారు. హిట్‌మ్యాన్ రోహిత్ అద్వితీయ బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు చేసింది. రోహిత్(140: 113 బంతుల్లో 14ఫోర్లు, 3సిక్సర్లు) శతకంతో అలరించగా.. లోకేశ్ రాహుల్(57: 78 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) అర్థశతకంతో విజృంభించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్మురేపాడు. 
 
అయితే, 47వ ఓవర్‌లో అకస్మాత్తుగా వర్షం రావడంతో మ్యాచ్‌ను అంపైర్లు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం 46.4 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి భారత్ 305 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(71), విజయ్ శంకర్(3) క్రీజులో ఉన్నారు. రోహిత్ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య(26 19 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్) ఉన్నంతసేపు రెచ్చిపోయాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన ధోనీ(1) ఆమిర్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న రెండో బంతికే వెనుదిరిగాడు. పాక్ బౌలర్లలో ఆమిర్ రెండు వికెట్లు తీయగా.. హసన్ అలీ, వాహబ్ రియాజ్ చెరో వికెట్ తీశారు.