1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (12:46 IST)

ప్రేమించిన వ్యక్తికి రెండో భార్యగా ఉండలేను... ఆత్మహత్య చేసుకున్న బాలిక

suicide
తాను ప్రేమించిన వ్యక్తికి రెండో భార్యగా ఉండటం ఇష్టంలేని ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా శుభకోట పంచాయతీ పరిధిలోని ఈదులగొంది గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈదులగొంది గ్రామానికి చెందిన పాంగి చిట్టిబాబు, తడిగిరి పంచాయతీ బోడ్డాపుట్టు గ్రామానికి చెందిన బాలిక (17) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నెల రోజుల క్రితం చిట్టిబాబుకు కుటుంబసభ్యులు మరో అమ్మాయితో వివాహం జరిపించారు. ఇంతలో బాలిక అనారోగ్యంగా ఉండటంతో కుటుంబసభ్యులు వైద్య పరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. దీంతో బాలిక బంధువులు.. చిట్టిబాబు కుటుంబసభ్యులతో ఆదివారం సాయంత్రం పెద్దమనుషుల పంచాయితీ పెట్టించారు. 
 
ఆమెను పెళ్లి చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనికి సమ్మతించిన చిట్టిబాబు బాలికను తీసుకొని తన స్వగ్రామం బోడ్డాపుట్టుకు వెళ్లారు. రాత్రి ఒంటి గంట సమయంలో బాలిక ఈ గ్రామంలో తన బంధువులు ఉన్నారని, అక్కడకి వెళ్తానని చెప్పి బయటకు వెళ్లింది. తాను ప్రేమించిన వ్యక్తికి రెండో భార్యగా ఉండలేనని, ఆత్మహత్య చేసుకుంటున్నానని తన సోదరికి మెసేజ్‌ పెట్టి మామిడి చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. .