1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 1 జనవరి 2022 (20:49 IST)

అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెట్ల పొదల్లో పడేసిన తల్లి... కెవ్వుమంటూ ఏడుస్తుండటంతో...

ఆడపిల్ల పుడితే భారం అన్నట్లు ఇప్పటికీ వివక్ష సాగుతోంది కొన్నిచోట్ల. ఆడపిల్ల పుడితే అత్తారింటికి అడుగుపెట్టనీయని పరిస్థితులు కూడా కొన్నిచోట్ల చూస్తున్న ఘటనలు వుంటున్నాయి. అంతకంటే కర్కశంగా అప్పుడే పుట్టిన నవజాత శిశువును చెట్లపొదల్లో పడేసి వెళ్లిన దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో చోటుచేసుకుంది.

 
ఒక పక్క కొత్త సంవత్సర వేడుకల్లో మునిగితేలుతున్న ఇండోర్ నగరంలోని లాసుడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసినగర్‌లో 31వ తేదీ రాత్రి వేకువజామున రోజు వయసున్న ఆడశిశువును చెట్ల పొదల్లో విసిరేసి పారిపోయింది కనికరం లేని తల్లి.

 
నవజాత శిశువు ఏడుపు పొదల నుంచి వస్తుండగా అటుగా వెళుతున్న ఓ యువకుడు లోనికి వెళ్లి చూశాడు. ఆ నవజాత ఆడశిశువు మెడలో పూలదండ వేసి చనిపోయినట్లుగా పొదల్లో విసిరేసి వెళ్లినట్లు కనుగొన్నాడు. ఎముకలు కొరికే చలిలో శరీరంపై దుస్తులు కూడా లేని స్థితిలో ఉన్న నవజాత ఆడ శిశువును చూసిన ఆ యువకుడు వెంటనే డయల్ 100కి సమాచారమిచ్చాడు.

 
ఘటనా స్థలానికి ఇద్దరు కానిస్టేబుళ్లు చేరుకుని నవజాత శిశువును ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ నవజాత శిశువుకి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగానే వున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ శిశువును పడవేసి పారిపోయిన తల్లి, కుటుంబం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.