సోమవారం, 29 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2025 (19:09 IST)

ఈ లోకంలో నేను బతకలేను. ముందూ వెనకా బురదే... మరో జన్మవద్దు....

medicos suicide
సముద్రతీర ప్రాంతం విశాఖపట్టణంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో ఒకరు రుషికొండలోని గీతం కళాశాల విద్యార్థి కాగా, తగరపువలసలోని ఎన్.ఆర్.ఐ కాలేజీకి చెందిన మరో విద్యార్థి ఉన్నారు. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన కథనం మేరకు... హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాలోని తెహిసిల్ చంబా గ్రామానికి చెందిన విస్మాద్ సింగ్ (20) గీతం వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో ఎంతో కలివిడిగా ఉండేవాడు. బుధవారం ఉదయం కళాశాలలోని ఆరో అంతస్తుకు చేరుకుని మెట్ల మార్గం మధ్య నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
'ఈ లోకంలో నేను బతకలేను. ముందూ వెనకా బురదే. నదీప్రవాహం ఎంత బలంగా ఉన్నా ఎక్కడో ఓ చోట ఆగిపోతోంది. నేను ఆ దారిలో మునిగిపోతాను. నాకు మరో జన్మ వద్దు' అని రాసిన సూసైడ్ నోట్‌ను మృతుడి గదిలో స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
అనకాపల్లి జిల్లా మాకవరపాలేనికి చెందిన చింతల దేముడు టాంజానియాలో పొక్లెయిన్ ఆపరేటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన కుమార్తె శివానీ జోత్స్న (21) తగరపువలస ఎన్ఆర్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మొదటి సంవత్సరంలో పలు సబ్జెక్టులు ఫెయిలైంది. 
 
ఆ పరీక్షలు తిరిగి రాయడానికి తల్లి గౌరితో కలిసి రెండు రోజుల కిందట విశాఖలోని మేనమామ ఇంటికి వచ్చింది. బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో వాకింగ్ కోసమంటూ మేడపైకి వెళ్లి ఐదంతస్తుల పైనుంచి దూకేసింది. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.